మెట్‌పల్లి కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుల తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

మెట్‌పల్లి కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకుల తిరుగుబాటు

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

● నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సింగరావు వ్యవహారశైలిపై అసంతృప్తి ● నామినేటెడ్‌ పోస్టుల్లో పార్టీ కేడర్‌కు అన్యాయం చేస్తున్నారని విమర్శలు ● అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి ● మున్సిపల్‌ ఎన్నికల్లో పలు వార్డుల్లో కాంగ్రెస్‌ టికెట్లు ఆశించి భంగపడిన నాయకులు రెబెల్స్‌గా బరిలోకి దిగారు. వారి వల్ల ఐదారు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వీరిలో సీనియర్‌ నాయకులు కూడా ఉన్నారు. ● నర్సింగరావు రెబెల్స్‌ను బుజ్జగించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేయకపోవడం వల్లనే తాము ఓడిపోయామనే భావనలో వారు ఉన్నారు. ● ఓడిపోయిన నేతలను ఆయన ఇంతవరకు కలిసి చర్చించకపోవడం.. పార్టీ కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి వారిలో అసంతృప్తికి దారి తీసింది. ● వీటికి తోడు ఇటీవల జరిగిన మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మాజీ కౌన్సిలర్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చి గెలిపించింది. కాంగ్రెస్‌లో ఎంతోమంది ఈ పదవులను ఆశించినప్పటికీ వారిని కాదని బీఆర్‌ఎస్‌కు చెందిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం వారిలో ఆగ్రహానికి కారణమైంది. ● ఇవన్నీ సమావేశంలో చర్చించిన వారంతా.. ఆయనతో తాడోపేడో తేల్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ● పట్టణంలోని కాంగ్రెస్‌ సీనియర్లు ఏకమై నర్సింగరావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడంపై ఆయన మద్దతుదారులు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ● మంగళవారం వారి విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ● మొత్తానికి మెట్‌పల్లి కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు రాబోయే రోజుల్లో ఎటు దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మెట్‌పల్లి: కోరుట్ల కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు వ్యవహారశైలిపై మెట్‌పల్లికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం హస్తం గూటిలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం కార్యాలయంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఎర్రొల హన్మాండ్లు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బర్ల సాయన్న, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ యామ రాజయ్య, మాజీ కౌన్సిలర్‌ ఎండీ.షాకీర్‌, మాన్కల గంగాధర్‌, అందె మారుతి, మారంపల్లి శంకర్‌, ఎలాల సంతోష్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నర్సింగరావు వైఖరిని వారు తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలో సీనియర్లను ఏమాత్రం లెక్క చేయడం లేదని, ఆర్థికంగా బలంగా ఉన్న వారిని మాత్రమే చుట్టూ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నామినేటేడ్‌ పోస్టుల విషయంలో కాంగ్రెస్‌ కేడర్‌ను విస్మరిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను తొందరలోనే అధిష్టానం దృష్టికి తీసుకపోతామని స్పష్టం చేశారు.

అసంతృప్తికి కారణాలివే..

ఎదురుదాడికి సిద్ధమవుతున్న జువ్వాడి మద్దతుదారులు

Advertisement
 
Advertisement
Advertisement