● 20 మంది బృందంతో రాక ● 7 టీంలతో అసెస్మెంట్ల కొలతలు
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో అటు ఏసీబీ, ఇటు విజిలెన్స్ అధికారులు తనిఖీలతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలే సుమారు 20 మంది ఏసీబీ అధికారులు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డులు పరిశీలించారు. అధికారుల వివరాలు తీసుకుని వెళ్లారు. వాటిపై విచారణ సాగుతోంది. తాజాగా మళ్లీ విజిలెన్స్ అధికారులు సోమవారం ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు తనిఖీ లు చేపట్టారు. గతంలో టౌన్ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ సెక్షన్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రికార్డులు తీసుకెళ్లారు. తాజాగా 20 మంది విజిలెన్స్ అధికారులు రాగా.. ఏడు టీంలతో తనిఖీలు చేపట్టారు.
భవనాల అసెస్మెంట్ల కొలతలు
ఏడు బృందాలు.. 60 మందితో మున్సిపల్ పరిఽ దిలోని పలు ప్రాంతాల్లో పలు భవనాలకు మళ్లీ కొలతలు చేపట్టారు. కొన్ని భవనాల పన్నుల్లో అవకతవకలు జరిగాయని, వారు జాబితా తీసుకుని వచ్చారు. అందులో ఉన్న భవనాలకు వెళ్లి వాటి కొలతలు చేపట్టారు. మున్సిపాలిటిలో ఉన్న వివరాలు, భవన వాస్తవ పరిస్థితుల మధ్య తేడాలను గుర్తించారు.
ఆదిలాబాద్లో జోనల్స్థాయి శాస్త్రవేత్తల సమావేశాలు
జగిత్యాలఅగ్రికల్చర్: పొలాస జోనల్ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశాలను ఆదిలాబాద్లో ఈనెల 28న నిర్వహిస్తున్నారు. వానాకాలం, యాసంగిలో సాగు చేయాల్సిన పంటలు, తెగుళ్లపై చర్చించనున్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ అధ్యక్షతన జరగనున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ డీన్లు పాల్గొంటారు.


