మల్యాల: మల్యాల మండలంలో ఆధ్యాత్మిక పరిమళాలు విరబూస్తున్నాయి. ఊరూరా ఆలయాల నిర్మాణాలతో ప్రజల్లో భక్తిభావం పెంపొందుతోంది. ఇప్పటికే కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఇదేక్రమంలో ఆలయాల నిర్మాణాలకు దాతలు తమ శక్తిని మించి విరాళాలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఆలయాల నిర్మాణాల కోసం విశ్రాంత ఉద్యోగులు, నాయకులు చొరవ తీసుకుంటూ నిర్మాణాలకు బాటలు వేస్తున్నారు.
రూ.కోటితో శ్రీవేంకటేశ్వర స్వామి
ఆలయ నిర్మాణం
లంబాడిపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన మరాటి సత్తయ్య తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.కోటి వెచ్చించారు. ప్రజలను ఆధ్యాత్మికతవైపు నడిపించేందుకు శ్రీపద్మాసమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టారు. వివిధ గ్రామాల నుండి తరలివస్తున్న భక్తులతో లంబాడిపల్లిలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇంకా ఆలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారు.
ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన మిట్టపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సుమారు రూ.80లక్షలతో అయ్యప్పక్షేత్రం నిర్మించారు. శ్రీదత్తాత్రేయ సాయి ఆలయానికి రూ.50లక్షలు, పోచమ్మ ఆలయానికి రూ.60లక్షలు వెచ్చించారు. మార్కండేయ ఆలయం, శివాలయాల అభివృద్ధికి రూ.30లక్షలు వెచ్చించారు. రామగిరి శ్రీరామ మందిరం రూ.2కోట్లతో నిర్మిస్తున్నారు. మానాల గ్రామంలో నల్లగుట్ట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు గండ్ర రాఘవేంద్రరావు సుమారు రూ.30లక్షలతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మరో రూ.50లక్షలతో అభివృద్ధి చేస్తున్నారు. తాటిపల్లి శివారులో మల్లెగట్టు మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సుమారు రూ.25లక్షలతో నిర్మించారు. పోచమ్మ ఆలయాలు, హనుమాన్ ఆలయాల పునరుద్ధరణ చేపడుతున్నారు. ఆలయాల అభివృద్ధికి స్థానికులు విరాళాలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడంతో ఊరూరా పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం కొనసాగుతోంది.
రూ.2కోట్లతో రామమందిర నిర్మాణం..
మండలకేంద్రంలో శ్రీరామమందిర నిర్మానానికి విశ్రాంత ఉద్యోగి ఎల్లాల జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ కమిటీ ఏర్పాటు చేశారు. దాతల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు స్థానికులతో గల్ఫ్లో ఉన్న స్థానికుల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు.
ప్రతి గ్రామంలో కనిపిస్తున్న నిర్మాణాలు
విరబూస్తున్న ఆధ్యాత్మిక పరిమళాలు


