జగిత్యాలఅగ్రికల్చర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను మూడురోజుల్లోనే పరిష్కరించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు. ప్రస్తుత సీఎం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పరిష్కరించారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి ఉన్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ.. మార్కెట్లకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటి చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేశ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య పాల్గొన్నారు.


