● చిన్న కొడుకును ప్రేరేపించిన తల్లి
● పెట్రోల్పోసి నిప్పంటించిన వైనం
● చావుబతుకుల్లో పెద్దకుమారుడు
● లక్కేపూర్ గ్రామంలో ఘటన
మంథనిరూరల్: కన్న కొడుకునే మరోకొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధరాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15ఏళ్లక్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసి చిన్నతమ్ముడు అనిల్, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
జగిత్యాలరూరల్: బీర్పూర్ మండలకేంద్రంలో మార్క్ఫెడ్, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. కేంద్రం మక్కలను కొనడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాల్కు రూ.2400 చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కేడీసీసీ మాజీ సభ్యులు ముప్పాల రాంచందర్రావు, ఎంపీడీవో భీమేశ్, తహసీల్దార్ సుజాత, సర్పంచ్ హరీశ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ నవీన్రావు, నారపాక రమేశ్, రవి, బీర్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


