జగిత్యాలరూరల్: తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం చాలని, గౌరవం దక్కని చోట పదవి ఎందుకని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్, బీర్పూర్ మండలకేంద్రాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ఉద్యమ నేత అని, వారి ఆలోచన, కార్యదక్షతతో రాష్ట్రం కార్యరూపం దాల్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ ఫలాలు పార్టీ కార్యకర్తలకు అందలేదన్నారు. కార్యకర్తల హక్కులు కాపాడలేకపోయానని, ఆ పార్టీ నాయకత్వం తనను మానసిక క్షోభ అనుభవించేలా చేసిందని పేర్కొన్నారు. 20 నెలలు ఓపిక పట్టినా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆత్మాభిమానం కోల్పోయినప్పుడు.. గౌరవం దక్కనప్పుడు పార్టీని వదులుకున్నానని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఉండాలనే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని వివరించారు. కేసీఆర్ ఊరూరా వైకుంఠదామాలు కట్టించారని, డంపింగ్యార్డులు, పల్లెప్రకృతి వనాలు, క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. రేవంత్ 90 రోజుల ప్రణాళిక అని, ఏం చేశారు..? ఏం చేస్తారు..? సరైన సూచనలు కూడా లేవని, లెక్కలు రాసుకోవాలి.. బిల్లులు ఎత్తుకోవాలి.. అనే రీతిలో ఉందన్నారు. రోల్లవాగు కట్ట పునర్నిర్మాణం చేసేలా ఉద్యమం చేశానన్నారు. ప్రాణహిత నది జలాలు తుమ్మడిహెట్టి వద్ద కట్టాలని తాను కూడా అన్నానన్నారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, జనంలో కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఆలోచన మొదలైందన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, జితేందర్, శంకర్, భూక్య సరళ, రమేశ్, ప్రసాద్, రాంచందర్రావు పాల్గొన్నారు.
గౌరవం దక్కని చోట పదవి ఎందుకు
మాజీమంత్రి జీవన్రెడ్డి


