జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు కష్టపడి పంటను పండించడంతోపాటు ఆ పంటను సరైన ధరకు అమ్ముకునేలా మార్కెటింగ్ వ్యూహరచన తెలుసుకోవాలని వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.సంధ్యాకిశోర్ తెలిపారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో సద్గురు ఫౌండేషన్ ఫర్ డెవలపర్, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం యువ రైతులకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉన్నందున సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. వరిలో వివిధ రకాలపై వరి శాస్త్రవేత్త శ్రీనివాస్, భూపరీక్షలు, పరీక్ష విధానం, పరికరాలపై శాస్త్రవేత్త సాయినాథ్, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్త రవి, హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిపై మధుకర్ వివరించారు. సద్గురు ఫౌండేషన్ ప్రతినిధులు ఉపేందర్, లిఖితలు పాల్గొన్నారు.


