బల్దియాలకు నిధులు
జగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. పాలకవర్గం లేకపోవడం.. నిధులు లేకపోవడం.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పట్టణాల అభివృద్ధి కుంటుపడుతోంది. మున్సిపాలిటీల్లో చిన్నచిన్న పనులు చేయాలన్నా నిధులు లేక చాలా చోట్ల నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఒకేసారి అన్ని బల్దియాలకు నిధులు విడుదల చేసింది. ఆ నిధులతో వచ్చే మార్చిలోపు పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో ఐదు (జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్) మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలకు రూ.15కోట్ల చొప్పున.. జిల్లాకేంద్రమైన జగిత్యాలకు మాత్రం రూ.62.5 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వచ్చే మార్చిలోపు పనులు పూర్తిచేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
వసతుల కల్పనే ధ్యేయం
మున్సిపాలిటీల్లో రహదారులు, డ్రైనేజీలు అధ్వానంగా మారాయి. శివారు ప్రాంతాల్లో సీసీరోడ్లు లేవు. కొన్నిచోట్ల శ్మశాన వాటికలు పూర్తిగా దెబ్బతి న్నాయి. కరెంట్ స్తంభాలు, ఓపెన్ జిమ్లు లేవు. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో ప్రతి చోట పనులు చేపట్టాలని ఆదేశాలు రావడం, నిధులు విడుదల కావడంతో మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. పట్టణాల్లో ప్రధానమైన సమస్య డ్రైనేజీ లేకపోవడం. సీసీరోడ్లు లేక వర్షకాలం వస్తే కాలనీల్లో నడవడం కూడా కష్టతరంగా మారింది. విడుదలైన నిధులతో పూర్తిస్థాయిలో రోడ్లు చేపడితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
విలీన ప్రాంతాలకు పెద్దపీట
మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. అక్కడ ఆశించిన మేరకు సేవలు అందడం లేదు. రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, డబుల్బెడ్రూంలు లేకపోవడంతో తాజాగా వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాలలో టీఆర్నగర్, మోతె, తిప్పన్నపేట, హస్నాబాద్, ధరూర్ గ్రామాలు విలీనమయ్యాయి. కోరుట్లలో యెకిన్పూర్ పూర్తిగా విలీనమైంది. కొన్ని గ్రామాల సర్వేనంబర్లతోపాటు కొన్ని గ్రామాలు మెట్పల్లిలో కలిపేశారు. రాయికల్, ధర్మపురి బల్దియాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో విలీన గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. సీసీరోడ్లు, అంతర్గత రహదారులు, మురికికాలువలు పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ పనులు చేపట్టాలని సూచించారు. జగిత్యాలలో టీఆర్నగర్ సమీపంలో అర్బన్ హౌసింగ్ కాలనీ పేరిట 4,825 డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అక్కడ వసతులు లేవు. విడుదలైన నిధులతో ఆయా కాలనీల్లో పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి.
త్వరలోనే టెండర్లు
వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చిలోపు పనులను పూర్తి చేసేలా చేపట్టాలని ఆదేశాలు రావడంతో త్వరలోనే టెండర్లు వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయితే మున్సిపాలిటీల రూపురేఖలు మారనున్నాయి. వీటికి ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పనులను వారే పర్యవేక్షించనున్నారు.
జగిత్యాలకు ప్రాముఖ్యత
అంతర్గత రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం
మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యానవనా లు, ఓపెన్జిమ్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. విలీన ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ కమిషనర్లు స్పందన, మనోహర్, డీఈ ఆనంద్, మెప్మా ఏవో శ్రీనివాస్, ఏఈలు చరణ్, అనిల్, టీపీబీవో శ్రీకర్ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ బ్యాగులను నివారించాలి
ప్లాస్టిక్ బ్యాగులను నివారించాలని ఎమ్మెల్యే అన్నారు. రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు జ్యూట్బ్యాగులు అందించారు. ప్లాస్టిక్ రహితం కోసం కృషి చేస్తున్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, ఆపి సంస్థలను అభినందించారు. స్పెషల్ ఆఫీసర్ రాజాగౌడ్, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు మంచాల కృష్ణ, శ్రీనివాస్, చారి, టీవీ.సూర్యం, జగదీశ్, రాజ్కుమార్ పాల్గొన్నారు.
జగిత్యాల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. బల్దియా కు రూ.62.5 కోట్లు మంజూరయ్యాయి. విలీన ప్రాంతాలతోపాటు, పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. మార్చిలోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– సంజయ్కుమార్, ఎమ్మెల్యే
బల్దియాలకు నిధులు


