
సన్న బియ్యం అక్రమ రవాణా
● దళారులకు సహకరిస్తున్న డీలర్లు ● అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న వ్యాపారం ● తనిఖీలు ముమ్మరం చేస్తున్న పౌర సరఫరాల శాఖ
గొల్లపల్లి: జిల్లాలో రేషన్బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండటం అక్రమార్కులకు అవకాశంగా మారింది. కొందరు డీలర్లు, వ్యాపారులు ముఠాగా ఏర్పడి బియ్యాన్ని అధిక ధరలకు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్కా లబ్ధిదారులు కూడా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన సమయంలో సాగిన అక్రమాలు ఇప్పుడు ఆగకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారుల కన్నుగప్పి అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
ఏళ్లుగా వేళ్లానుకుని..
రేషన్ బియ్యం అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరించింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యం పక్కదారి పడుతున్నాయి. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులు తినలేక డీలర్లు, ఇతరులకు అమ్మేవారు. ఇక కొందరు వ్యాపారులు రేషన్ షాపుల్లో మిగిలిన, లబ్ధిదారుల వద్ద సేకరించిన బియ్యాన్ని ప్రాసెస్ చేయించి అధిక ధరకు విక్రయించే వారు. కొందరు బడా వ్యాపారులు, మిల్లర్లు, ఇతరులనుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం సేకరించి పాలిస్ చేయించాక విదేశాలకు ఎగుమతి చేశారు. కొన్ని సందర్భాలలో టాస్క్ఫోర్స్ బృందాలు బియ్యం లారీలను పట్టుకున్నా దందా ఆగలేదు.
సన్న బియ్యంతో చెక్పెట్టాలని..
గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. వాటిని తినేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మద్య తరగతి ప్రజలు అయితే బియ్యం అసలే తీసుకోలేదు. ఇదే అదునుగా బడా వ్యాపారులు జేబులు నింపుకున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు కచ్చితంగా తింటారనే భావనతో ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. తొలినెలలో బియ్యాన్ని లబ్ధిదారులు అధిక సంఖ్యలో తీసుకెళ్లి తినడానికి వీలుగా ఉన్నాయని తెలిపారు. తద్వారా అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని పౌరసరఫరాల శాఖ అధికారులు భావించారు.
కఠిన చర్యలు తీసుకుంటేనే..
సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడమే కాక లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేయడమేకాక రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే బియ్యం అమ్మిన, కొనుగోలు చేసిన వారిపై కేసులు పెడుతామని చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలంటే తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు రేషన్ షాపులపై నిఘా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.
పక్కాగా పక్కదారి..
ప్రభుత్వం, అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ కొందరు వ్యాపారులు సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నెల పూర్తిగా లబ్ధిదారులు బియ్యం తీసుకోగా.. ఆ తరువాత నెల నుంచి సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కులు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యంతో రూ.లక్షలు కొల్లగొట్టిన వ్యాపారులు.. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో ప్రణాళిక ప్రకారం పక్కదారి పట్టించే కుట్రకు తెరలేపారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు తీసుకోకపోగా.. మిగిలిన సన్నబియ్యం ఇంకొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచే నేరుగా సేకరించడం మొదలు పెట్టారు. దొడ్డు బియ్యం కన్న ఎక్కువ డబ్బు ముట్టచెబుతుండటంతో పలుచోట్ల లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన సన్న బియ్యాన్ని తరలిస్తుండగా జిల్లాలోని కొన్ని చోట్ల పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇటీవలే 50 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని తరలిస్తుండగా సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. ఇవే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని తరలించినట్లు తెలుస్తోంది.