● దశాబ్దకాలంగా అడుగు ముందుకు పడని వైనం ● దాతలు సిద్ధంగా ఉన్నా.. నిర్మాణాలు వాయిదా ● వసతులు లేక ఇబ్బంది పడుతున్న భక్తులు
మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాటు.. ఆలయ పవిత్రను కాపాడే ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తూ రూపొందించిన మాస్టర్ ప్లానే అభివృద్ధికి అడ్డంకిగా మారింది. అధికారుల అలసత్వంతో మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. భక్తులకు వసతులు కల్పన కోసం నిర్మాణాలు చేపట్టేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ప్లాన్ అమలైతే దాతల నిర్మాణాలు కూల్చివేసే అవకాశం ఉంది.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు ప్రతిరోజూ దర్శనానికి వస్తుంటారు. ముఖ్యంగా స్వామివారికి ప్రీతిపాత్రమైన మంగళ, శనివారాల్లో అధిక రద్దీ ఉంటుంది. అయితే ఆ మేరకు వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంజన్న ఆలయంలో ఏటా నిర్వహించే హనుమాన్ చిన్న, పెద్ద జయంతికి సుమారు ఐదు లక్షలకు పైగా దీక్షాపరులు వస్తుంటారు. ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ వంటి దూరప్రాంతాల నుంచి పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఆలయ అభివృద్ధికి 372 ఎకరాలు
మల్యాల మండలం పరిధిలో కొండగట్టు ఉంటుంది. ఈ ఆలయ సమీప గుట్టలతోపాటు సుమారు 372 ఎకరాల స్థలం దేవస్థానానికి రెవెన్యూ అధికారులు బదిలీ చేశారు. మెట్లదారి వెంట రోప్వే నిర్మాణం చేపట్టి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు దశాబ్దం క్రితమే ప్రణాళిక రూపొందించినా ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కొండగట్టు ఆలయ సమీపంలోని అటవీ భూములు కూడా ఆలయానికి బదిలీ చేయడం.. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
వసతుల కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు అంజన్న దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. వాహనాలకు ఆలయం వరకు అనుమతి ఇవ్వకపోవడంతో దూరంగా పార్కింగ్ చేయాల్సి వస్తోంది. వై జంక్షన్ సమీపంలో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి సన్నిధిలో 11 రోజులు, 21 రోజులు నిద్రిస్తే మానసిక, మనోవ్యాధులు నయమవుతాయనే విశ్వాసంతో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అలాంటి వారికి గదుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 36 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో సిబ్బంది కొరత ఉంది. మాస్టర్ ప్లాన్ అమలుతో వాహన పార్కింగ్తోపాటు భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని దశాబ్దకాలంగా భక్తులు ఎదురుచూస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. ఏళ్ల నాటి మారుతి నిలయం శిథిలావస్థకు చేరింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టులో వంద గదుల భవన నిర్మాణానికి టీటీడీ సుముఖంగా ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడడం లేదు.
మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు
అంజన్న ఆలయ పునర్నిర్మాణం, విమాన గోపురం నిర్మాణం, రాతి కట్టడాలు, రాతి శిల్పాలు ఏర్పాటు..
స్వామివారి నూతన 2వ ప్రాకారం, నాలుగు వైపులా రాజగోపురాలు
యాగశాల, నిత్య నివేదనశాల నిర్మాణం
రామాలయం పునర్నిర్మాణం
అభిషేక మంటపం
శ్రీ సత్యనారాయణ స్వామి మంటపం
ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
భక్తుల వసతి కోసం రెండు చోట్ల 100 గదుల ధర్మశాల నిర్మాణం
50 వీఐపీ గదుల నిర్మాణం
రెండతస్తులతో రెండు డార్మెటరీ హాల్స్ నిర్మాణం
నిత్యాన్నదాన సత్రం నిర్మాణం
లడ్డూ, పులిహోర ప్రసాదాలు తయారు చేయు మండపం
దేవస్థానం పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
కొండగట్టులో దారి పొడవునా విద్యుత్ దీపాలు
దేవస్థానం పరిసరాల సుందరీకరణ
ఆలయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్
అర్చకులకు రెండు వసతి గృహాలు, పాచక, పరిచారకులతోసహా 40 క్వార్టర్లు నిర్మాణం
ఆలయ సిబ్బంది, కార్యనిర్వహణ అధికారికి 100 క్వార్టర్ల నిర్మాణం
కొండగట్టుకు వెళ్లే దారిలో 50 గదుల రెండు ధర్మశాలల నిర్మాణం
అశోక వనములో స్వామివారిని నిత్య అలంకరణ కోసం పూలతోట ఏర్పాటు
వాహనాల పూజ కోసం ప్రత్యేక షెడ్డు నిర్మాణం
దీక్షావిరమణ మండప భవన నిర్మాణం
దుకాణాల సముదాయాల నిర్మాణం
మెట్లదారి అభివృద్ధి
దేవస్థానం కోసం నిత్యం నీటి సరఫరా
సులభ్ కాంప్లెక్సు నిర్మాణం
మాస్టర్ ప్లాన్ లేదు.. అభివృద్ధి కానరాదు