
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్
ధర్మపురి: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న జర్నలిస్టు బాబుకుమార్కు తెలంగాణ మీడియా అకాడమీ వెల్ఫేర్ స్కీం కింద మంజూరైన రూ.లక్ష విలువగల చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తూ వార్తల సేకరణకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని, అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని డిమాండ్ చేశారు. అప్పుడు సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్.. తన శాఖలో అనేక అవకతవకలు జరిగాయని, వాటిని కూడా ప్రజలముందుంచుతామని అన్నారు. రూ.వంద కోట్లతో ధర్మపురికి ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
పురోహితుల సన్మానం
ఆలయాల్లో పని చేస్తున్న పురోహితులకు కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆదివారం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవరణలో విప్ లక్ష్మణ్కుమార్ను సన్మానించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేశ్, కుంట సుధాకర్ తదితరులున్నారు.