
క్షణికావేశంలో తండ్రిని హత్య చేసిన కొడుకు
మేడిపల్లి: క్షణికావేశంలో కన్న కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మేడిపల్లి మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కోరుట్ల సీఐ సురేశ్బాబు, మేడిపల్లి ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన అంగడి నర్సయ్య అలియస్ గంగారెడ్డి (56) తాగివచ్చి కొడుకు వెంకటేశ్తో ఘర్షణ పడ్డాడు. దీంతో క్షణికావేశంలో వెంకటేశ్ దగ్గరలో ఉన్న ఇనుప వస్తువుతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో గంగారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం వెంకటేశ్ మేడిపల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు సంతానం. కొడుకు వెంకటేశ్ ఇటీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వెంకటేశ్కు ఇంకా పెళ్లి కాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్త్సె వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
కరీంనగర్–నిజామాబాద్ రూట్లో ఈడీలక్స్ బస్సులు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్–నిజామాబాద్ రూట్లో గురువారం నుంచి ఈడీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు కరీంనగర్ 2 డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి 6.30 వరకు, మధ్యాహ్నం 1గంట నుంచి 3.30 వరకు ప్రతీ 30 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని అన్నారు. ఈ బస్సులో ప్రయాణికులకు 10శాతం రాయితీతో పెద్దలకు రూ.230, పిల్లలకు రూ.130 చార్జి ఉంటుందని తెలిపారు.
ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యేక బ్యాక్లాగ్ అవకాశం
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ నాల్గో సెమిస్టర్ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్ష ప్రత్యేక రుసుముతో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డి.సురేశ్కుమార్ తెలిపారు. జూన్ 3వ తేదిలోగా తమ కళాశాలల్లో ప్రతీ పేపర్కు రూ.1500 లు చెల్లించాలని పేర్కొన్నారు.
ఎస్యూలో మొదటిదశలో 5,931 డిగ్రీ సీట్ల భర్తీ
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని దోస్త్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 5,931 డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీ జరిగింది. ఎస్యూ పరిధిలో మొత్తం 36,540 సీట్ల ఉండగా మొదటి దశలో 5,931 సీట్లు భర్తీ కాగా 30,609 సీట్లు ఖాళీగా మిగిలాయి. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 సీట్లు భర్తీకాగా, 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో 2,047 సీట్లు భర్తీ అయ్యాయి. ఇదిలా ఉండగా 60 ప్రైవేట్ కళాశాలల్లో కలిపి 3,587 మంది విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. మొదటిదశలో సీట్లు పొందిన వారు జూన్ 6వ తేదీలోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.