
‘మద్దతు’ ధరపై పెదవి విరుపు
● వరి క్వింటాల్కు రూ.69.. మక్కలకు రూ.175 ● పెరిగిన ధరలతో జిల్లా రైతులకు రూ.63 కోట్ల లాభం
జగిత్యాలఅగ్రికల్చర్: ఏటా మాదిరిగానే వానాకాలం సీజన్కు ముందు పంటల మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే వరికి క్వింటాల్కు రూ.69 మాత్రమే పెంచడంతో పెద్దగా ఉపయోగం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలా అరకొరగా పెంచడంతో ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. ఇందులో వరి క్వింటాల్కు రూ 69, మొక్కజొన్నకు రూ.175 పెంచింది. దీంతో వరి క్వింటాల్ ధర రూ.2.389కు చేరింది. కామన్ రకానికి రూ.2300 ఉండగా.. తాజగా రూ.2369కు చేరింది. మొక్కజొన్నకు మొన్నటి వరకు రూ.2,225 ఉండగా.. రూ.175 పెరగడంతో రూ.2400కు చేరింది.
జిల్లా రైతులకు రూ.63 కోట్ల లాభం
జిల్లాలో ప్రతి సీజన్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 75 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత ధర రూ.2,320 ప్రకారం రైతులకు రూ.1,740 కోట్లు వస్తే.. పెరిగిన ధర రూ.2,389 ప్రకారం రైతులకు రూ.1791కోట్లు రానున్నాయి. మొక్కజొన్నను దాదాపు 35 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా.. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున దిగుబడి అంచనా వేస్తే 7 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుత ధర రూ.2,225 ప్రకారం రైతులకు రూ.156 కోట్లు వస్తే.. పెరిగిన ధర రూ.2400 ప్రకారం రూ.168 కోట్లు రానున్నాయి. ఈ లెక్కన రైతులకు అదనంగా రూ.63 కోట్లు రానున్నాయి. పంటలకు మద్దతు ధర పెరగడంతో ఎక్కువగా దొడ్డురకంతోపాటు మొక్కజొన్నను అధికంగా సాగు చేసే అవకాశం ఉంది.
క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడంతోనే
పంట సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా పెంచుతోంది. గతేడాది వరి క్వింటాల్కు రూ.143 పెంచగా.. ఈ ఏడాది కేవలం రూ.69మాత్రమే పెంచింది. మద్దతు ధరలను నిర్ణయించే కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, రైతుల నుంచి సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే కొంత మేలు జరిగేది. గతంలో ఉన్న ధరలకే ఎంతో కొంత శాతం కలిపి ఇస్తుండటంతో సాగు ఖర్చులకు, రైతులకు వచ్చే ఆదాయానికి పొంతన ఉండటం లేదు. ఇవేమీ పట్టించుకోకుండా ధరల నిర్ణాయక కమిషన్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చే యడంతో రైతులకు అంతంతమాత్రంగానే లాభం చేకూరుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు రెట్టింపు ఆదాయం రావాల్సి ఉండగా.. కనీసం ఖర్చులు కూడా రావడం లేదు.
ఏటా రూ.250 పెంచాలి
ఏటా వరికి అదనంగా రూ.250 వరకు పెంచితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. రూ.50, రూ.వంద పెంచితే రైతులకు పెద్దగా లాభం ఉండదు. మద్దతు ధర కొంత పెరిగితే కూలీల ఖర్చు రెట్టింపు అవుతోంది. – గడ్డం సత్యనారాయణ రెడ్డి,
జిల్లా ఉత్తమ రైతు, ధర్మపురి
సిఫార్సు మేరకు పెంచాలి
రైతులు పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం రావాలి. అప్పుడే రైతులు నిలదొక్కుకునే అవకాశం ఉంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటల ధరలు పెరగడం లేదు. ర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచాలి.
– వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు

‘మద్దతు’ ధరపై పెదవి విరుపు

‘మద్దతు’ ధరపై పెదవి విరుపు

‘మద్దతు’ ధరపై పెదవి విరుపు