
రజతోత్సవ సభ విజయవంతం
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతమైందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... సభకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నించినా జనం భారీగా తరలివచ్చారని, దీనిని జీర్ణించుకోలేని కొందరు మంత్రులు అక్కసువెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గానికి మంజూరైన అగ్రికల్చర్ కళాశాల తరలిపోకుండా అక్కడి ఎమ్మెల్యే కాపాడాలన్నారు. జిల్లా విద్యార్థులకు కొత్త విద్యాలయం తీసుకురావాలిగానీ.. మంజూరైన అగ్రికల్చర్ కళాశాల తరలిపోతుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదని హితవు పలికారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత, వైస్ చైర్మన్ హరిచరణ్రావు, ఆనందరావు పాల్గొన్నారు.