యూఎస్‌ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి! | Six Pro Iranian Fighters Killed In Likely US Strikes On Syria, Details Inside - Sakshi
Sakshi News home page

US Strikes: యూఎస్‌ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి!

Feb 3 2024 8:02 AM | Updated on Feb 3 2024 9:21 AM

Six Pro Iranian Fighters Killed in US Strikes - Sakshi

జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతిగా యూఎస్‌ మిలటరీ ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియా స్థావరాలపై బాంబు దాడి చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సిరియాలో జరిగిన యూఎస్‌ వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మరణించారు. వారిలో ముగ్గురు నాన్ సిరియన్లు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతు కలిగిన 85 మిలీషియా స్థావరాలపై అమెరికా ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించిందని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.

కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్‌లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సైనిక వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్‌ దళాలు 125కు మించిన యుద్ధ సామగ్రితో 85కు మించిన లక్ష్యాలపై దాడి చేశాయి. అదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు, ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందారని, చాలామంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వ మీడియా తెలిపింది.
 

ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఒక ప్రకటనలో అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని అన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు. శుక్రవారం డోవర్ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో వీర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో బైడెన్‌ పాల్గొన్నారు. 

గత వారంలో జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు యూఎస్‌ సైనికులు మృతిచెందారు. ఈఘటనలో సుమారు 40 మంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద గ్రూపులపై ప్రతీకార దాడులు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement