ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తర కొరియా మరో ప్రయోగం చేసింది. తమ దేశానికి చెందిన “చోయ్ హ్యోన్” అనే యుద్ధనౌక నుంచి రెండు స్ట్రాటజిక్ క్రూయిజ్ క్షిపణులు, మూడు యాంటీ-వార్షిప్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ స్వయంగా పరిశీలించారు.
ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. క్రూయిజ్ క్షిపణులు సుమారు 7,869 నుంచి 7,920 సెకన్లపాటు ప్రయాణించగా, యాంటీ-షిప్ క్షిపణులు 1,960 నుంచి 1,973 సెకన్లపాటు గాల్లో ప్రయాణించాయని పేర్కొంది. ఎల్లో సీ మీదుగా ముందుగా నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని తెలిపింది.
ఈ విన్యాసం యెుక్క ప్రధాన లక్షం సమీకృత ఆయుధ నియంత్రణ వ్యవస్థను మరియు మెరుగైన యాంటీ-జామింగ్ నావిగేషన్ వ్యవస్థను పరీక్షించడం, అలాగే సిబ్బందికి ప్రయోగంపై అవగాహన కల్పించడమనంది. కాగా ఇటీవల నార్త్ కొరియా ప్రపంచానికి తన ఆయుధ శక్తిని ప్రదర్శించేలా తరచుగా క్షిపణులు ప్రయోగం చేపడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ దాదాపుగా 10కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో అధికంగా బాలిస్టిక్, క్రూయిజ్, మరియు హైపర్సోనిక్ క్షిపణులు అధికంగా ఉన్నాయి.


