చరిత్ర సృష్టిద్దాం.. మద్దతివ్వండి: మోదీ | Modi Seeks Opposition Support For Women's Reservation Bill | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టిద్దాం.. మద్దతివ్వండి: మోదీ

Apr 17 2026 2:34 PM | Updated on Apr 17 2026 2:45 PM

Modi Seeks Opposition Support For Women's Reservation Bill

ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటులో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ నడుస్తోన్న వేళ ఎక్స్‌ వేదికగా ‍ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. పార్లమెంటు తీసుకునే ఈ నిర్ణయం కోసం యావత్‌ మహిళా లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. మహిళల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదని  అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఓటింగ్‌కు ముందు కీలక నేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందేలా సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు విపక్షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

రాజకీయ లబ్ధికోసమే ఈ బిల్లు తీసుకవచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది నిరంతరం ప్రక్రియని మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకు పెట్టారని ఆరోపించారు. ఇక తమిళనాడు డీఎంకే సైతం ఇదివరకే డీలిమిటేషన్‌కు తమ పార్టీ వ్యతిరేకమని ‍ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశాలకు వారు నల్లదుస్తులు ధరించి హాజరయ్యారు. 

రాజ్యాంగ సవరణ బిల్లులకు పార్లమెంటులో మూడింట, రెండో వంతు మెజార్టీ అవసరముంటుంది. అనగా 360 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఎన్డీఏ బలం 294 దీంతో ఇంకా 64 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగతుందా అనే టెన్షన్‌  సర్వత్రా నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement