ఆ అమ్మ కథ కదిలించింది.. రిస్క్‌ చేసి మరీ వీరాభిమాని దగ్గరికే జాన్‌ సీనా

John Cena Meets Fan With Down Syndrome From Ukraine - Sakshi

ఆ అమ్మ కథ.. ఓ స్టార్‌నటుడిని కరిగించింది. ఆ కథ తెలుసుకుని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌, హాలీవుడ్‌ నటుడు జాన్‌ సీనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న తన వీరాభిమానిని ఎట్టకేలకు కలుసుకున్నాడు. పైగా ఆ అభిమాని ఉక్రెయిన్‌ శరణార్థి కావడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. 

19 ఏళ్ల మిషా రోహోజైన్‌, డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న టీనేజర్‌. కొడుకు పరిస్థితి చూసి.. తండ్రి చిన్నప్పుడే వదిలేశాడు. అప్పటి నుంచి ఆ ఒంటరి తల్లే కొడుకు ఆలనాపాలనా చూసుకుంటోంది. ఉక్రెయిన్‌ మరియాపోల్‌ వాళ్ల స్వస్థలం. ఒకప్పుడు అతని ఇంటి నిండా జాన్‌ సీనా పోస్టర్లే. కానీ, యుద్ధంతో వాళ్ల ఇళ్లు నాశనం అయ్యింది. ప్రాణాలు అరచేతపట్టుకుని ఆ తల్లీకొడుకులు దేశం విడిచారు. అయితే..

ఇంటిని, ఇంట్లో ఉన్న జాన్‌ సీనా పోస్టర్లను వదిలి వెళ్లేందుకు మిషా ఇష్టపడలేదు. దీంతో జాన్‌ సీనాను కలిపిస్తాం అంటూ ఆ తల్లి ఆ కొడుకుని బతిమాలి దేశం దాటింది.  అమ్‌స్టర్‌డ్యామ్‌ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్నారు వాళ్లు. అప్పటి నుంచి మిషా, జాన్‌ సీనాను కలవాలని గోల చేయడం మొదలుపెట్టాడు. ఈ తరుణంలో.. 

మే నెలలో నెదర్లాండ్స్‌కు జాన్‌ సీనా వస్తున్నాడని తెలిసి.. అక్కడికి వెళ్లారు. కానీ, ఆ సూపర్‌ స్టార్‌ రాలేదు. నిరాశగా వెనుదిరిగారు వాళ్లు. ఈ ఉక్రెయిన్‌ శరణార్థి కథ.. ఈ మధ్యే వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో పబ్లిష్‌ అయ్యింది. ఆ కథనం ద్వారా విషయం తెలుసుకున్న సీనా.. ఆ తల్లి సాహసానికి ఫిదా అయ్యాడు. అంతేకాదు తన వీరాభిమాని మిషాను కలుసుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. అమ్‌స్టర్‌డ్యామ్‌ దగ్గర ఓ శరణార్థ క్యాంపులో తలదాచుకున్న ఆ కుటుంబాన్ని కలుసుకున్నాడు జాన్‌ సీనా. శరణార్థి శిబిరం కావడంతో అనుమతులు దొరకడం ఇబ్బంది అయ్యింది. ఇబ్బందులు తలెత్తుతాయాన్న ఉద్దేశంతో డబ్ల్యూడబ్ల్యూఈ సైతం స్పానర్‌షిప్‌ చేయలేదు. దీంతో తన సొంత ఖర్చులతో రిస్క్‌ అయినా సరే జాన్‌ సీనా, ఆ తల్లీకొడుకులను కలుసుకున్నాడు. మిషాకు తన గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు ఇచ్చాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top