హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఎంపిక చేసిన నౌకలకే అనుమతి
హర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.
భారత్కు ప్రాధాన్యత
"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు.


