మూడు వ్యాక్సిన్‌లు చివరి దశలో ఉన్నాయి: ట్రంప్‌

Donald Trump Says US Will Crush Covid with Vaccine by Year End - Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేస్తోన్న సంగతి తెలిసిందే. వైరస్‌ని అంతం చేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ను తరిమికొడతానని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్‌ అధ్యక్ష పదవికి గురువారం రెండో సారి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్’‌ కింద కరోనా వైరస్‌ కట్టడి కోసం తమ దేశం తెలివిగల శాస్త్రవేత్తలను నియమించిందని తెలిపారు. ‘రికార్డు సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మేధావులైన అమెరికా శాస్త్రవేత్తలను నియమించాం. వారందరి కృషితో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసి కరోనాను ఖతం చేస్తాము’ అన్నారు ట్రంప్‌. ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌ల ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయని.. త్వరలోనే వాటి ఉత్పత్తి ప్రారంభించి ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకోస్తామని తెలిపారు. (చదవండి: విన్నింగ్‌ మేట్స్‌)

రెండవసారి అధ్యక్ష పదవికి నామినేట్‌ చేయడం పట్ల కృతజ్ఞత తెలిపారు ట్రంప్‌. గత నాలుగేళ్లలో సాధించిన అసాధారణ పురోగతిపై గర్వపడుతున్నానని తెలిపారు. అలాగే రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వలమైన భవిష్యత్తుపై అనంతమైన విశ్వాసంతో ఉన్నామని ట్రంప్ అన్నారు. అటు అమెరికా అధ్యక్ష పదవికి  డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్‌పై   విమర్శలు  కురిపించారు.  బిడెన్ అమెరికాను రక్షించేవాడు కాదని, అమెరికా ప్రతిష్టను, ప్రజల ఉద్యోగాలను నాశనం చేసేవాడని ఆరోపించారు. ట్రంప్‌ను ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top