Anand Mahindra: 'సెక్యూరిటీ బుర్రకు పనిచెప్పి ఉంటే షింజో అబే ప్రాణాలతో బయటపడేవారు'
Published
Mon, Jul 11 2022 9:37 AM
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది వైఫల్యం ఉందని పేర్కొన్నారు. సెక్యూరిటీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే షింజో బతికి ఉండేవారని చెప్పారు.
అబేపై కాల్పులు జరిపినప్పుడు మొదటి తూటాకు, రెండో తూటాకు మధ్య కాస్త గ్యాప్ ఉందని మహీంద్రా వివరించారు. ఆ సమయంలో సెక్యూరిటీ షింజో అబేనూ కవర్ చేసి, ఆయనకు బుల్లెట్ తగలకుండా చూసుకుని ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా కాకుండా కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకే భద్రతా సిబ్బంది ప్రయత్నించారని మహీంద్రా విమర్శించారు.
The first shot missed. There was a potentially life-saving gap until the second shot. Shouldn’t his security have jumped on Abe & flattened & covered him instead of chasing the assailant? He could have & should have survived this. pic.twitter.com/aGSI1SO3yA
షింజో అబే ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. తెత్సుయా యమగామీ అనే వ్యక్తి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. సొంతంగా తయారు చేసుకున్న గన్తో ఈ దారుణానికి పాల్పడ్డాడు. షింజోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని క్షణాల్లోనే పట్టుకున్నారు భద్రతా సిబ్బంది.
అనంతరం ఓ మతసంస్థపై ద్వేషంతోనే తాను షింజోను హత్య చేసినట్లు యమగామీ తెలిపాడు. జపాన్ అధికారులు కూడా షింజో భద్రతలో వైఫల్యాలు ఉన్నాయని అంగీకరించారు.