తెలుగు రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం చౌర్యం

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా లీక్‌ కేసు తీగ లాగితే డొంక కదులుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌తోనూ లింకులు ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. రక్షణ శాఖ, టెలికం విభాగం, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు ఇలా.. 138 విభాగాలకు చెందిన 16.8 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను చౌర్యం చేసి, విక్రయిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తొలుత నోయిడా, ఢిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజల వ్యక్తిగత సమాచారం మాత్రమే ఉందని పోలీసులు భావించినప్పటికీ.. దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

థర్డ్‌ పార్టీ ఏజెన్సీల నుంచేనా?
డేటాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రజల వ్యక్తిగత వివరాలు సైతం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డేటాను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ పోలీసు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ (టీఎస్‌పీసీసీ) ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల వివరాలు తస్కరణకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు, పిన్‌, సీవీవీ నంబర్లతో సహా ఫోన్‌ నంబర్లు, చిరునామా వంటి సమాచారం ఉన్నట్లు తెలిసింది. డేటా లీక్‌పై హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లోతుగా ఆరా తీస్తోంది. రక్షణ శాఖకు చెందిన 2.6 లక్షల మంది వ్యక్తిగత వివరాలు సైతం నిందితులు చౌర్యం చేసిన నేపథ్యంలో.. ఆర్మీ విభాగం, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా వివరాలను విశ్లేషించేందుకు సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు సైబరాబాద్‌ పోలీసులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి కాకుండా థర్డ్‌ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ సమాచారం బహిర్గతమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సాంకేతిక నిపుణుల సహాయంతో...
సైబరాబాద్‌ డీసీపీ కల్మేశ్వర్‌ శింగేన్వర్‌ నేతృత్వంలో 9 మంది పోలీసులతో ఏర్పాటైన సిట్‌.. ఈ కేసును 360 డిగ్రీల కోణంలో దర్యాప్తు చేస్తోంది. డేటా ఎలా లీకై ంది? ఎవరెవరికి విక్రయించారు? ఈ డేటాతో ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు? విదేశాలకు డేటా తరలించారా? వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసు పూర్తిగా సాంకేతిక అంశంపైనే ఆధారపడి ఉండటంతో సైబరాబాద్‌ పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయాన్ని తీసుకుంటున్నారు. తస్కరించిన డేటాను నిందితులు జస్ట్‌ డయల్‌లో డేటా ప్రొవైడర్ల పేర్లతో రూ.2 వేలకు 50 వేల మంది ప్రజల సమాచారాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో తొలి దశలో జస్ట్‌ డయల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంపెనీలతో పాటు బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులను విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలోనే ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేయనున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. గొలుసుకట్టు మార్కెటింగ్‌ తరహాలో ఉండటంతో అనేక మందికి ఈ కేసుతో సంబంధాలుండే అవకాశం ఉందని, త్వరలోనే మరికొందరిని అరెస్టు చేస్తామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top