ఐనవోలు మల్లన్న హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కించారు. 2 జనవరి 2026 నుంచి 19 జనవరి 2026 వరకు 17 రోజులకుగాను హుండీల్లో రూ.39,78,975, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.80,28,251 రాగా, మొత్తం రూ.1,20,07,226 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ ఉప కమిషనర్ కార్యాలయ పరిశీలకులు గౌరీ శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ బరిగెల భాస్కర్, ఆర్ఐ రాణి, ధర్మకర్తలు, కానిస్టేబుళ్లు రాజు, రమేశ్, యస్మిన్, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ, ముల్కనూరు సొసైటీ మధ్య సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరిందని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్, ముల్కనూరు కో–ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రాంరెడ్డి, అభిలాష్రెడ్డి ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఎంఓయూతో కేయూలోని మెస్లకు అవసరమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఆసంస్థ నిబంధనల ప్రకారం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూ ప్రకారం ఆరునెలల పాటు బియ్యాన్ని సరఫరా చేస్తారు. నాణ్యతగల బియ్యాన్ని నిబంధనల మేరకు అందించనున్నట్లు రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, మల్లారెడ్డి, మల్లికార్జున్రెడ్డి, ఎన్.వాసుదేవరెడ్డి, పి.వరలక్ష్మి, ఎస్.జ్యోతి, డాక్టర్ ఎన్.రమణ తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట రూరల్: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కాజీపేట నుంచి ఈ నెల 26వ తేదీ నుంచి నెలాఖరు వరకు బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న మేడారం జాతరకు కాజీపేట రైల్వే స్టేడియం నుంచి బస్సులు నడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, సోమవారం స్టేడియంలో ప్రయాణికులకు ఏర్పాటు చేయనున్న వసతులను అధికారులు పరిశీలించారు.
ఐనవోలు మల్లన్న హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు


