గ్రీన్ఫీల్డ్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లా నుంచి వెళ్లే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూసేకరణపై కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్హెచ్–163జీకి 165.11 హెక్టార్ల భూసేకరణకు ఇప్పటివరకు 159.96 హెక్టర్ల భూసేకరణ పూర్తి అయిందన్నారు. కోర్టు కేసులతో పెండింగ్లో ఉన్న మిగిలిన 27.21 హెక్టార్ల భూసేకరణను ఈనెల 21లోగా పూర్తిచేయాలని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించి ల్యాండ్ అక్విజేషన్ పూర్తిచేయాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్య, ఏడీ సర్వేల్యాండ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈసారి కొనుగోళ్లకు 258 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ. 2,389, సాధారణ రకానికి 2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, మేనేజర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి అనురాధ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


