
సర్వీస్ బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలోని 2002 డిసెంబర్ 31వరకు నియమితులై విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సర్వీస్ బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. మొత్తం ఎనిమిది కౌంటర్లను ఏర్పాటుచేసి వెరిఫికేషన్ చేశారు. అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు మొత్తంగా 369మంది ఉండగా వెరిఫికేషన్ ప్రక్రియకు 329 మంది ఎస్ఏలు హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. ఈ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7:30 గంటల వరకు కొనసాగింది. పదోన్నతుల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తున్నారు.
భారీగా గంజాయి పట్టివేత
న్యూశాయంపేట: విజయనగరం నుంచి మహారాష్ట్రకు భారీ మొత్తంలో తరలిస్తున్న 8.655 కిలోల గంజాయిని మిల్స్కాలనీ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ అశ్రఫ్, షేక్ రహీం, అబ్బని పటేల్, ప్రవీణ్ తాడే, రాజ్ఠాకూర్.. మొహిన్ సూచనల మేరకు విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వద్ద గంజాయి బ్యాగులు తీసుకున్నారు. వరంగల్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్నారు. వరంగల్ స్టేషన్ నుంచి బయటకు వస్తూ పోలీసులను చూసి వారు పారిపోవడానికి యత్నించారు. వారిని పోలీసులు పట్టుకుని విచారించగా, వారి దగ్గర నుంచి 8.655 కిలోల గంజాయి లభ్యమైందని, దాని విలువ సుమారు. రూ.4 లక్షల 32వేల 750 ఉంటుందని ఎస్సై తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వివరించారు.
రాష్ట్రస్థాయి సదస్సు
మడికొండ : మడికొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శుక్రవారం రాష్ట్రస్థాయి 10వ నేత్ర వైద్యనిపుణుల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు మూడ్రోజుల (11,12,13) పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి వెయ్యి మందికి పైగా నేత్ర వైద్యులు పాల్గొన్నారు. అనుభవాలు, నూతన వైద్య పద్ధతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా వరంగల్కు చెందిన డాక్టర్ కె.రాజ విజయ్కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని వారు తెలిపారు. సదస్సులో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ భరత్కుమార్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ అయిత రాజరవీంద్ర, సెక్రటరి డాక్టర్ ప్రవీణ్, వైద్యులు రాజ్కుమార్, వేణుమాధవ్, పరమేశ్వర్రావు, రాజలింగం, రిషి స్వరూప్, భద్రినారాయణ, హరికిషన్ పాల్గొన్నారు.
రేప్ కేసులో ఐదేళ్ల జైలు
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వాడగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రేప్ కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వెంకటాపురం సీఐ బండారి కుమా ర్ వివరాల ప్రకారం రేప్ కేసులో జాడి రోశయ్యకు ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

సర్వీస్ బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్