Telangana Crime News: విహారయాత్ర సందర్శించి.. తిరుగు ప్రయాణంలో.. తీవ్ర విషాదం!
Sakshi News home page

విహారయాత్ర సందర్శించి.. తిరుగు ప్రయాణంలో.. తీవ్ర విషాదం!

Sep 22 2023 12:56 AM | Updated on Sep 22 2023 12:10 PM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ నిట్‌ విద్యార్థుల విహారయాత్ర విషాదమైంది. పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరుగు ప్రయాణమైన వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పక్కన ఆగి ఉన్న లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున ములుగు మండలం జంగాలపల్లిలో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌కు చెందిన ముర్తూజా, ఉమర్‌, సాయి, సుజిత్‌, ఏపీలోని విజయవాడకు చెందిన శ్రేయ, తాడేపల్లి గూడేనికి చెందిన నిస్సి సిజు.. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. తిరుగు ప్రయాణంలో ములుగు మండలం జంగాలపల్లిలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది.

దీంతో కారులో ఉన్న ఆరుగురు విద్యార్థుల్లో నిస్సి సిజు (19) అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ రంజిత్‌ కుమార్‌, ఎస్సై వెంకటేశ్వర్‌ వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.

మిగతా విద్యార్థులు శ్రేయ, ముర్తుజ, ఉమర్‌, సుజిత్‌కు తీవ్రగాయాలు కావడంతో హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. నిస్సి మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కాగా, రోడ్డు ప్రమాదంలో ఫ్రెండ్‌ మృతి చెందిన విషయం తెలుసుకొని నిట్‌ విద్యార్థులు ములుగు ఏరియా ఆస్పత్రికి వచ్చి బోరున విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడికి గురి చేశాయి. కాగా, బాధిత కుటుంబాలను మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అజ్మీరా ప్రహ్లాద్‌ పరామర్శించారు.

ఏడు నెలలు గడవకముందే..
నిట్‌ వరంగల్‌కు చెందిన థర్డ్‌ ఇయర్‌ విద్యార్థి రిత్విక్‌ ఏడు నెలల క్రితం క్యాంపస్‌ నుంచి రాత్రి పది గంటలకు బయలుదేరి ఆరెపల్లి ప్రాంతంలోని వంగపహాడ్‌ దగ్గర బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదంలో మృతి చెందాడు. రిత్విక్‌ మృతి చెంది ఏడు నెలలు గడవకముందే నిట్‌కు చెందిన మరో ఆరుగురు విద్యార్థులు కారు యాక్సిడెంట్‌కు గురికావడం.. ఇందులో ఒకరు మృతి చెందడం పలువురిని కంటతడికి గురి చేసింది.

రోజూ బయటకు ఎందుకు..?
నిట్‌ క్యాంపస్‌లో 6వేల మంది విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు క్లాస్‌ రూంలు, ల్యాబ్స్‌, సెమినార్‌ హాల్స్‌ ఉన్నాయి. అలాగే, భోజనం, వసతికి బాలురకు 1కే,1.8కే, బాలికలకు న్యూ,ఓల్డ్‌ బ్లాక్‌, ప్రియదర్శిని బ్లాక్‌ల్లో వసతి ఏర్పాట్లకు గాను కళాశాల ఫీజుతోపాటు మెస్‌కు గాను ఏడాదికి రూ. 14వేలు తీసుకుంటున్నారు. రోజూ ఉదయం టీ, టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌, స్నాక్స్‌ అందిస్తుంటారు. ఇలా రోజూ అందిస్తున్నా ఫుడ్‌ కోసం విద్యార్థులు బ యటకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించే నాథులే లే కపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. ఇప్పటికై నా నిట్‌ యాజమాన్యం విద్యార్థులకు భద్రత కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇలా జరుగుతుందని అనుకోలేదు..
నేను, నా మిత్రులు ముర్తుజా, ఉమర్‌, సాయి, శ్రేయ, నిస్సి ఫుడ్‌ కోసం హనుమకొండ బాలసముద్రంలోని ఓ హోటల్‌కు వెళ్లాం. అక్కడ ఆలస్యం కావడంతో సరదాగా కారులో లక్నవరం బయలుదేరాం. కానీ రోడ్డు ప్రమాదం అవుతుందని, మాకు ఇలా జరుగుతుందని అనుకోలేదు. గురువారం తెల్ల వారుజామున చోటుచేసుకున్న ప్రమాదంలో అసలేం జరిగిందో అర్థం కాలేదు. లారీ ఒక్కసారిగా ఓవర్‌ టేక్‌ చేయడంతో కారు నడిపే మా స్నేహితుడికి ఏం చేయాలో తెలియలేదు. –సుజిత్‌, నిట్‌ విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement