కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు మెడికల్ ఆధునిక జీవనశైలి వల్ల నేడు దంపతుల్లో సంతానలేమి (ఇన్ఫెర్టిలిటి) సమస్యలు పెరిగిపోతున్నాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో కిమ్స్ ఫెర్టిలిటి ఐవీఎఫ్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరు ఆబ్స్ట్రిక్ట్ అండ్ గైనకాలాజికల్ సొసైటీ సహకారంతో ఇన్ఫెర్టిలిటి గురించి వైద్యులకు ఫెమ్కాన్ పేరుతో నిరంతర వైద్య విద్య కార్యక్రమం(సీఎంఈ) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం సంతాన చికిత్సలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఐవీఎఫ్ సెంటర్లో చట్టపరంగా చికిత్సలు అందించాలని చెప్పారు. పేదలకు సైతం ఆధునిక సంతాన చికిత్సలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మాత మరణాలు నివారించడంలో సీ్త్ర వైద్య నిపుణులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్య సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మాత మరణాలను పూర్తిగా తగ్గించే దిశగా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై సమగ్ర పర్యవేక్షణతోపాటు, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఆధునిక వైద్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే ఆస్పత్రుల వారు తప్పని సరిగా తమ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పీజీ వైద్యులకు, నూతనంగా ప్రాక్టీస్లోకి వస్తున్న వైద్యులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. సీఎంఈ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కర్నాటకకు చెందిన డాక్టర్ ప్రత్యూష్కుమార్ నారాయణ్ సంతాన చికిత్సల్లో హార్మోన్స్ ఏవిధంగా స్పందిస్తాయనే విషయాలను, డాక్టర్ హితేష్బట్ సంతాన చికిత్సలు చేసే సమయంలో పాటించాల్సిన చట్టపరమైన అంశాలను, డాక్టర్ సచిన్ కులకర్ణి ఐవిఎఫ్ చికిత్సలు ఎవరికి చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలనే విషయాల గురించి వివరించారు. సదస్సులో వైద్యులు, నిపుణులు పాల్గొని ఫెర్టిలిటీ, ఎంబ్రియాలజీ రంగాల్లో వచ్చిన అధునాతన పోకడలను వివరించారు. కార్యక్రమంలో కిమ్స్ ఫెర్టిలిటి ఐవిఎఫ్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ బి.శ్వేత, సీఓఓ సుధర్జాదవ్, డాక్టర్ ఐ.ప్రత్యూష, డాక్టర్ శిరీషా, ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్, యూనిట్హెడ్ డాక్టర్ ఎస్. వి.హరికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్, గుంటూరు ఆబ్స్ట్రిక్ట్స్ అండ్ గైనకాలాజికల్ సొసైటి ప్రెసిడెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జీజీహెచ్ గైనకాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ అరుణ, పలువురు గైనకాలజిస్ట్లు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్లు తదితరులు పాల్గొన్నారు.


