బహిరంగ ప్రదేశాలు రహదారులపై వేడుకలు వద్దు
నగరంపాలెం: జిల్లాలో ఈనెల 31 రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా వేడుకల పేర్లతో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రజలు పోలీసుల సూచనలను విధిగా పాటించాలని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు డ్రైవ్ చేయడం నేరమని అన్నారు. జిల్లా అంతటా ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా మద్యం మత్తులో పట్టుబడితే కేసులు నమోదు చేసి, జైలుకి తరలిస్తామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేయించేందుకు చర్యలు చేపడతామని హెచ్చరించారు. అతి వేగం, బైక్ పోటీలు, సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దాలు చేయడం, హారన్లు మోగించిన చర్యలు తప్పవని అన్నారు. మైనర్లకు మోటారు సైకిళ్లను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రధాన కూడళ్లల్లో పోలీస్ పికెట్లు, రాత్రి వేళ గస్తీ, డ్రోన్ పెట్రోలింగ్ ఉంటుందని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో కేక్ కటింగ్లు, నృత్యాలు, బహిరంగ పార్టీలు, డీజేలు పూర్తిగా నిషేధమని చెప్పారు. బాణాసంచా కాల్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లోనే మద్యం విక్రయాలు జరగాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మద్యం దుకాణాలు, బార్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహణకు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు లేదా ఇబ్బందులు ఎదురైతే డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.


