
రాజధాని రైతులపై ‘పూలింగ్’ పిడుగు
సాక్షి ప్రతినిధి, గుంటూరు / తాడికొండ: రాజధాని పరిసర ప్రాంత అన్నదాతల నెత్తిన మళ్లి భూ సమీకరణ పిడుగు పడనుంది. రెండు రోజుల కిందట కేబినెట్ భేటీలో మరో 43వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరమంటూ సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెదవి విరుస్తున్న రైతులు
ప్రస్తుతం సమీకరించిన 33 వేల ఎకరాల భూమి గడచిన 12 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, వారికే న్యాయం జరగనప్పుడు తాము భూ ములు ఇస్తే ఏం చేస్తారంటూ రైతులు పెదవి విరిస్తున్నారు. రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. మళ్లీ భూసమీకరణ అంటే ఎలా ? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సమీకరణ సమయంలో ఇచ్చిన ఒప్పందాలు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చేసిన లే–అవుట్లను అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాని ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు.. దానికి రోడ్లు, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.
త్యాగం చేసిన రైతులకు నష్టం
ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం మినహా భూములిచ్చి త్యాగం చేసిన రైతులకు గత 12 ఏళ్లల్లో ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రానున్న నాలుగేళ్లలో సమీకరణ ప్రక్రియ పూర్తి కాదని, ఒకవేళ భూములిస్తే తరువాత తమ సంగతేంటనేది ఆ ప్రాంత రైతుల నుంచి వస్తున్న ప్రశ్న.
రైతుల్లో పలు సందేహాలు
ఇటీవల తాడికొండ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో స్థానిక రైతులు పలు సందేహాలు లేవనెత్తారు. ఒక వేళ పూలింగ్కు తీసుకుంటే కౌలు రూ. 40 నుంచి రూ.50వేలు ఇవ్వాలని కొంత మంది కోరారు. మరికొంత మంది అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భూ సమీకరణ జరుగుతున్నప్పుడు చిన్న గ్రామాలు తొలగిస్తే తమ సంగతేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రామాలు తొలగించమని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ రైతులు నమ్మడం లేదు. తమ గ్రామాలు తొలగించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూములు ఇవ్వమని కరాఖండిగా
చెబుతున్న రైతులు
ముందు 33వేల ఎకరాల్లో అభివృద్ధి చేసి చూపించిన తరువాత తాము పూలింగ్కు సహకరిస్తామని, ఇప్పుడికిప్పుడు తమ భూములు వదులుకోబోమని కరాఖండిగా రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారి భూములు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న నేపథ్యంలో పూలింగ్ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారే ప్రస్తావిస్తుండటం గమనార్హం.
రైతుల్లో వ్యతిరేకత
పరిధి విస్తరణ పేరుతో
43వేల ఎకరాల సమీకరణ
భూముల రేట్లు అధికంగా ఉండటంతో
ఇచ్చేందుకు రైతుల విముఖత
అవసరాల మేరకే
తీసుకోవాలంటూ సీఎంని
కోరిన అధికార పార్టీ నేతలు
అంతర్జాతీయ విమానాశ్రయం
పేరుతో తమ భూములకు
గండికొట్ట వద్దంటున్న రైతులు
రెండు గ్రామాలు కాలగర్భంలో
కలిసిపోతాయని భయపడుతున్న
గ్రామస్తులు
తాడికొండ మండలానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఇటీవల పొన్నెకల్లు గ్రామంలో జరిగిన పీ –4 సదస్సుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అందులో రైల్వే లైనులు, అంతర్గత రహదారుల వరకు భూ సమీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అన్ని పొలాలు పూలింగ్కు ఇవ్వాలంటే సుముఖంగా లేమంటూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అనుకున్నదే తడవుగా భూ సమీకరణ పేరుతో నిర్ణయం తీసుకుని మంత్రివర్గ భేటీలో ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు తీకున్న నిర్ణయంపై రైతులు బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం పూలింగ్కు తీసుకున్న భూములకు ధరలు తగ్గి, తీవ్రంగా నష్టపోతామంటూ గతంలో పూలింగ్కు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తమ పరిస్థితి మారిందని వాపోతున్నారు. తరతరాలుగా ఉన్న పంట భూములను ప్రభుత్వం తీసుకునేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు చాలని గతంలో ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయ వినామాశ్రయం పేరుతో తమ పొట్ట గొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.