
తప్పుడు విధానాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ధూళ్ళిపాళ్ల రమాదేవి
సత్తెనపల్లి: ప్రజలకు సూపరిపాలన అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేస్తుందనిసీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు దూళ్ళిపాళ్ల రమాదేవి విమర్శించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో రమాదేవి ఆధ్వర్యంలో సీపీఎం బృందం సోమవారం పర్యటించింది. అనంతరం సత్తెనపల్లి పుతుంబాక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి అక్రమ రవాణా అరికట్టవచ్చునన్నారు. రేషన్ షాపుల వద్దకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దకే రేషన్ బియ్యం వాహనాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూల్కు తరలించడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 3,4 నెలల పాటు పెండింగ్లో పెడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారి సంగతి తేలుస్తానని అనడం సరికాదన్నారు. దేవుళ్లను, మతాలను రక్షించడానికి పవన్ కల్యాణ్ రాజకీయాలకు వచ్చారా? లేదా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. జిల్లా కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి, జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, పట్టణ కార్యదర్శి డి.విమల పాల్గొన్నారు.