
71 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
పొన్నూరు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ముఠా గుట్టురట్టయింది. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యంను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం పొన్నూరు 29వ వార్డులోని ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 71 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ వీరానాయక్ బియ్యం నిల్వలను పరిశీలించారు. వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిల్వ చేసిన 29వ వార్డుకు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు స్వాధీన పరిచినట్లు ఎస్ఐ తెలిపారు.
తెనాలిలో 35 బస్తాలు స్వాధీనం
తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి నుంచి బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు గురువారం తెల్లవారుజామున అంగలకుదురు వద్ద తనిఖీ చేయగా పట్టణానికి చెందిన రమావత్ లోకేష్ అలియాస్ సూర్యనాయక్ టాటా దోస్త్ వాహనంలో 50 కిలోల చొప్పున ఉన్న 35 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పెదరావూరుకు చెందిన అశోక్, బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన కార్తీక్ రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరులోని రౌస్ మిల్లుకు తరలిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రైస్ మిల్లు ఓనరు లోకేష్, అశోక్, కార్తీక్లపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు.