
విద్యార్థులతో కూటమి ప్రభుత్వం బంతాట
తాడేపల్లి రూరల్ : కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని అంబేడ్కర్ ఐఐటీ నీట్ మహిళా అకాడమీ(గురుకుల పాఠశాల)ని మైలవరానికి తరలించ వద్దంటూ విద్యార్థినులు సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నీట్, ఐఐటీ శిక్షణకు అద్దె భవనాలలో అకాడమీని స్థాపించారని తెలిపారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో శిక్షణకు గాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 100 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని, ఒక్కొక్కరికీ రూ. 75 వేలు ఫీజుగా చెల్లించి కార్పొరేట్ కళాశాలల్లో చేర్చే వారని తెలిపారు. దీంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం కావడంతో ర్యాంకులు సాధించే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చీఫ్ సెక్రటరీ రావత్, సెక్రటరీ రాములు, చైర్మన్, అధికారులు బోర్డు మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు కార్పొరేట్ విద్యకు దీటుగా ఐఐటి, నీట్ అకాడమీలు స్థాపించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ఈడుపుగల్లులో అంబేడ్కర్ ఐఐటీ నీట్ మహిళా అకాడమీ ఏర్పాటు చేశారని వివరించారు. అధికారులు అలసత్వం వహించి విద్యార్థుల సంఖ్యను తగ్గించడం, నిర్ణీత సమయానికి అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో ఆశయం పూర్తిగా నెరవేరలేదని విమర్శించారు. ఈ స్థితిలో విద్యార్థులు, భావితరం వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈడుపుగల్లు నుంచి విద్యార్థులను తరలించే కార్యక్రమాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.