
పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: నిరంతర పోరాటాలతోనే హక్కులను పరిరక్షించుకోగలమని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు పేర్కొన్నారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్ వద్ద సోమవారం 79వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వమే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సమరంలో బానిస సంకెళ్లను బద్దలు కొట్టి, 1946 మే 1న ఎస్టీయూ ఆవిర్భవించిందని తెలిపారు. 1947 జూన్ 9వ తేదీ నుంచి అధికారిక గుర్తింపు పొందిన తొలి ఉపాధ్యాయ సంఘం అని వివరించారు. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన ఎస్టీయూ 78 ఏళ్లుగా నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ప్రగతి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు వివిధ సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వాలతో పోరాడి, సాధించడంలో విశేష కృషి చేసిందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలకు పుట్టినిల్లు ఎస్టీయూ అని చెప్పారు. సంఘ ఉద్యమ నేతలు మగ్దుం మొహిద్దీన్, పీవీ రాఘవాచారి, వీణా విజయ రామరాజు, పి. శ్రీరామమూర్తి వంటి నాయకల త్యాగం మరువలేనిదని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేస్తూ సంఘ పురోభివృద్ధికి పాటుపడాలని పెదబాబు సూచించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ మొహబూబ్ సుభాని, నాయకులు పి. దిబ్బయ్య, వై. శ్యాంబాబు, యు. మహంకాళరావు, ఎంపీ సుబ్బారావు పాల్గొన్నారు.
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు