
శ్రష్టి వర్మపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు
లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటలు చేసిన దేశ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరంలోని శనివారం జరిగిన కన్నప్ప ప్రీ రీలిజ్ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి విచ్చేసిన మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసిన కరీం ఈమేరకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ సినీ కొరియోగ్రాఫర్గా ఉన్న శ్రష్టి వర్మ జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూలను కించపరుస్తూ మాట్లాడారన్నారు. స్టార్ హీరోలను సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న శ్రష్టి వర్మ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంచు విష్ణు, విచారించి, ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
13న న్యాయవాదుల సమావేశం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్ ఇన్ హోటల్లో న్యాయవాదుల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు కీలకమైన అంశాల గురించి సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు. కార్యక్రమానికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మలసాని మనోహర్రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్న్స్ జె సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డిలతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తలు పాల్గొంటారని తెలిపారు. సమావేశానికి న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి
ముగ్గురికి గాయాలు
దుగ్గిరాల: ఎదురెదురుగా వస్తున్న ద్వి చక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం చిలువూరు దగ్గర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్తలూరు మండలం, ప్యాపర్రు గ్రామానికి చెందిన కొల్లూరి వీరాంజనేయులు(35) గుంటూరులో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గుంటూరు వెళ్లి తిరిగి వస్తుండగా దుగ్గిరాల మండలం చిలువూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఘటనలో వీరాంజనేయులు తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్పై తీవ్రంగా గాయపడిన రాయపూడి డేవిడ్ను చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు, మరో ఇద్దరు క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృత దేహాన్ని మంగళగిరి ఎయిమ్స్కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

శ్రష్టి వర్మపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు