అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి బుధవారం దాతలు రజత కవచం సమ ర్పించారు. మండల పరిధిలోని ధరణికోటకు చెందిన కామని వీరయ్య, సామ్రాజ్యం దంపతులు సుమారు రెండుకిలోల 395 గ్రాముల బరువుతో రూ.3లక్షల విలువైన రజత కవచానికి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ఈఓ రేఖకు అప్పగించారు. అనంతరం అర్చకులద్వారా సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కవచాన్ని అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమపూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు
నేడు జెడ్పీ గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తూ గ్రేడ్–2 హెచ్ఎం ఉద్యోగోన్నతుల కోసం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు గురువారం ఉదయం 8 గంటలకు జెడ్పీ కార్యాలయ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో హాజరు కావాలని సూచించారు.
శివాలయంలో అవినీతిపై విచారణ
మంగళగిరి : మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో జరిగిన అవినీతిపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవస్థాన అభివృద్ధికి దాతలు అందించిన నగదును రికార్డులలో నమోదు చేయకపోవడంతో అభివృద్ధి పనులలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు బుధవారం ఆలయానికి చేరుకుని ఈవో కార్యాలయంలో పలు ఫైళ్ళును స్వాధీనం చేసుకున్నారు.
పునఃప్రారంభమైన సదరం క్యాంప్
తెనాలిఅర్బన్: వికలాంగుల ధృవ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. ఆర్థో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ జరుగుతుందని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు.
31న అయ్యప్ప స్వామి దేవస్థాన వార్షికోత్సవం
చిలకలూరిపేట: ఓగేరు వాగుకు దక్షిణాన ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవం ఈ నెల 31వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం దేవస్థాన వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కమిటీ సభ్యులు తవ్వా నాగమల్లేశ్వరరావు, సత్యనారాయణ, భవిరిశెట్టి మణి పాల్గొన్నారు.