
ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
తాడికొండ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమరావతికి విచ్చేస్తున్న సందర్భంగా వెలగపూడి, సచివాలయం ప్రాంతానికి దగ్గరలో ఏర్పాటు చేసిన ‘అమరావతి పునఃప్రారంభం సభ’ ప్రాంగణాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం పరిశీలించారు. సభావేదిక, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అతిథులు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలు, సభాప్రాంగణంలో కూర్చునే వారందరికీ చేసిన ఏర్పాట్లు, సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, ఆహారం, తాగునీరు, భద్రతా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సంబంధిత అధికారులను ఆయా అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రితో పాటు మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లి రవీంద్ర, పలు శాఖల అధికారులు ఉన్నారు.
అమరావతి పునఃనిర్మాణం చారిత్రక ఘట్టం
తెనాలి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో అమరావతి పునఃనిర్మాణం చారిత్రాత్మక ఘట్టం కానుందని రాష్ట్ర రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి అన్నారు. అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో జనసమీకరణలో భాగంగా గురువారం మంత్రి రామ్ప్రసాద్రెడ్డి తెనాలి వచ్చారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కలిసి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల కలగా గుర్తుచేశారు. రాజధాని పునఃనిర్మాణాన్ని యజ్ఞంలా చేపడుతున్న రాష్ట్రప్రభుత్వానికి ప్రజలందరి మద్దతు తెలియజేయాలని కోరారు. చంద్రబాబు నాయుడుకి రాజధాని, పోలవరం రెండు కళ్లుగా చెబుతూ, ఆ రెండింటి నిర్మాణం కోసం కేంద్రం ఆశీస్సులతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా, యువజన సర్వీసులు,
క్రీడలు శాఖ మంత్రి ఎం.రామ్ప్రసాద్రెడ్డి

ప్రధాని సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు