
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన
వెలగపూడి(తాడికొండ): తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలోని సచివాలయం సమీపంలో మే 2వ తేదీన జరగనున్న అమరావతి తదితర శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజలతో కలిసి మంగళవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్ షో సాగే మార్గాలు, ప్రధాన వేదిక, పబ్లిక్, వీవీఐపీ, గ్యాలరీల వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లు నిర్దేశిత సమయం కంటే ముందే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మేయర్ ఎన్నికకు 28న ప్రత్యేక సమావేశం
నోటిఫికేషన్ జారీ చేసిన
రాష్ట్ర ఎన్నికల సంఘం
నెహ్రూ నగర్: గుంటూరు నగర మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ఉత్తర్వులను అనుసరించి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించాలని, ఈ ఎన్నికకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజను ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల అధికారి ద్వారా ఈ నెల 24 లోపు గుంటూరు నగర పాలక సంస్థ కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులు 28న ప్రత్యేక సమావేశానికి హాజరు కావలసినదిగా నోటీసులు అందనున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మేయర్ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ అథారిటీ, సీడీఎంఏ డాక్టర్ పి. సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు.
పోలేరమ్మ వారి
వార్షికోత్సవాలు
తెనాలి: స్థానిక వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని శ్రీ పోలేరమ్మ వారి ఆలయం 27వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఉదయం విశేష పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమ, విశేష అలంకరణతో మేళతాళాలు, కాళికా వేషం, భాజా భజంత్రీలతో తెనాలి పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఆలయ ధర్మకర్త వీరయ్య, గుంటి వెంకట్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. బుధవారం ఉదయం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై చర్చకు వినతి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లో అసోసియేషన్ నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్ల సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. జేఎస్సీ సమావేశం ఏర్పాటుతో అనేక అంశాలు చర్చించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం.

ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన