
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఫిరంగిపురం: ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లను బుధవారం రాత్రి నారాయణ పరిశీలించారు. ముఖ్యమంత్రి మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం సందర్భంగా ఐదు కోట్ల మొక్కలు నాటుతామన్నారు. రాజధాని ప్రాంతాన్ని అత్యున్నత నిర్మాణాలతోపాటు గ్రీన్ అండ్ బ్లూ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. పచ్చదనం కోసం ఒకే రకం మొక్కలు కాకుండా సింగపూర్, జపాన్తో సంప్రదించి అక్కడి మాదిరిగా ప్లాంటేషన్ ఉండేలా చూడమని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండీ లక్ష్మీపార్థసారథి, ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ సుజాత, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిరంగిపురం(తాడికొండ): తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే వన మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పర్యటన ఏర్పాట్లను ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, రాష్ట్ర ఏపీఎంఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఆర్డీవో శ్రీనివాసరావులు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు చేపట్టాల్సిన వివిధ పనులపై తగిన సూచనలు అందజేశారు. శానిటేషన్, పార్కింగ్, బ్యారికేడ్ పనులు సజావుగా చేపట్టాలని చెప్పారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. వారి వెంట ఫారెస్ట్ కన్జర్వేటర్ రాజు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎండీ నజీమా బేగం, ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బసవేశ్వరరావు, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్లు సుజాత, వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు ఉన్నారు.
అత్యుత్తమ నగరంగా అమరావతి నిర్మాణం

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన