
బదిలీల కలవరం
కరోనా కలకలం...
● వైద్య ఉద్యోగుల్లో ఆందోళన ● ఐదేళ్లు దాటితే స్థాన చలనం ● యూనియన్లకు ప్రాధాన్యత అంతంతే
గుంటూరు మెడికల్: జిల్లాలో ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను కూడా ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గతంలో అనేక మంది వైద్య ఉద్యోగులు కరోనా బారిన పడి చికిత్స పొందారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. మరోసారి కరోనా కేసులు రావడం ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. మరోపక్క వైద్య ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 19వ తేదీలోపు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేయనున్నారు.
ఐదేళ్లు సర్వీసు పూర్తయితే బదిలీ
ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులు, వైద్య సిబ్బందికి తప్పనిసరిగా స్థానచలనం కలిగించనున్నారు. గతంలో దీర్ఘకాలం ఉన్న సిబ్బందిలో 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేసేవారు. దీంతో అందరూ ఇబ్బంది పడేవారు కాదు. ఇప్పుడు ఐదేళ్ల సర్వీసు, కొన్ని కేడర్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయాలని నిబంధన పెట్టారు. దీంతో బదిలీల కలవరం ప్రారంభమైంది.
ప్రాక్టీస్ వదిలి వెళ్లలేక..
దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేయడం వల్ల గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, జిల్లాలోని పలు ఆసుపత్రుల వైద్యులు ఎక్కువ శాతం మంది సొంత క్లీనిక్లు పెట్టుకున్నారు. గుంటూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తప్పనిసరి బదిలీ నిబంధనతో ప్రాక్టీస్ వదిలి వెళ్లేందుకు పలువురు సంశయిస్తున్నారు. వైద్య సిబ్బంది సైతం గుంటూరు చుట్టుపక్కల పిల్లలను చదివించుకుంటూ, గృహాలు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. విద్య, వైద్య రంగంలో ఎప్పటి నుంచో గుంటూరు జిల్లాకు పేరుండటంతో అనేక మంది స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. బదిలీల పేరుతో ప్రభుత్వం వేరేచోటకు పంపించేందుకు సిద్ధమడంతో వారు ఆందోళన పడుతున్నారు.
జూనియర్ అసిస్టెంట్ల ఆందోళన
జీజీహెచ్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు వదులుకొని సుమారు 20 –30 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రమోషన్ తీసుకుంటే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారన్న భయంతో ఇలా చేశారు. అందులోనూ గుంటూరు జీజీహెచ్లోనే జీవితాంతం పనిచేసేందుకు అన్ని బెన్ఫిట్స్ వదులుకుని పలువురు జూనియర్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వారిని సైతం బదిలీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. దీంతో జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రపతి అనుమతి లేకుండా గుంటూరు జీజీహెచ్ యూనిట్ సిబ్బందిని బదిలీ చేసే అధికారం ఎవరికీ లేదనే విషయాలను బయటపెట్టారు. సదరు విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం పంపించారు. దీంతో ఈ ఏడాదికి జూనియర్ అసిస్టెంట్లకు బదిలీలు లేనట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి.
యూనియన్లకు ఆంక్షలు
గతంలో యూనియన్ పేరుతో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకే ప్రాంతంలో ఉండేవారు. నేడు ఒకేచోట లేకుండా పలు మార్గదర్శకాలను సంఘ నాయకులకు ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్లో చేరిన సభ్యత్వాల రశీదులు, ఎన్నికల్లో పాల్గొన్నట్లు జాబితా, యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరాలు సమర్పించాలని పేర్కొంది. దీంతో నేతలకు సైతం స్థానచలనం తప్పడం లేదు. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి యూనియన్ నేతలు బదిలీ కోరుకునేలా కొంత మినహాయింపు ఇచ్చారు.
20 రోజుల ప్రక్రియ
వైద్య ఆరోగ్య శాఖలో బదిలీ ప్రక్రియ 20 రోజులపాటు జరుగనుంది. మే 31 నుంచి జూన్ 19వ తేదీ వరకు నిర్వహిస్తారు. జూన్ 17 – 19 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. తర్వాత బదిలీ ఉత్తర్వులు అందజేస్తారు. ఒకేచోట రెండేళ్లకుపైగా పనిచేస్తున్న వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు, ఉద్యోగులైన భార్యభర్తలకు నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహిస్తారు. గురు, శుక్రవారాల్లో అభ్యర్థులు బదిలీ ఆప్షన్లు ఎంచుకునేందుకు గడువు ఇచ్చారు. గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయం, గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు కొద్దిరోజులుగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.