
ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు డీఆర్ఎం ఎం.రామకృష్ణ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో రెండో రోజు బుధవారం కూడా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం కొనసాగింది. ఇందులో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని చెప్పారు. ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. గుంటూరు, నడికుడి, నంద్యాల హెల్త్ యూనిట్లలో ఔట్సోర్సింట్ క్లీనింగ్ సిబ్బందికి ఆరోగ్య పరీక్ష శిబిరాలు నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్లో నుక్కడ్ నాటక ప్రదర్శన సహా సాంస్కృతిక వేడుకలు, ప్రయాణికులకు కాటన్ బ్యాగుల పంపిణీ, సెల్ఫీ బూత్, బాటిల్ క్రషింగ్ మెసీన్ కార్యాచరణ తనిఖీ, ఔట్ సోర్సింగ్ క్లీనింగ్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ, సఫాయి మిత్రలకు కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన వంటి కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలోనూ డీఆర్ఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ ఎం.రవికిరణ్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ షేక్ షాహబాజ్ హనూర్, ఏడీఎంఈ రవీంద్ర, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు డీఆర్ఎం ఎం.రామకృష్ణ రైల్వే స్టేషన్లో రెండో రోజూ ‘స్వచ్ఛతా హి సేవ’