నదీ జలాలతో ఆటలాడవచ్చా? | Sakshi Guest Column On River waters India Pakistan | Sakshi
Sakshi News home page

నదీ జలాలతో ఆటలాడవచ్చా?

Jun 3 2025 12:36 AM | Updated on Jun 3 2025 12:36 AM

Sakshi Guest Column On River waters India Pakistan

విశ్లేషణ

పాల్‌ సెజాన్‌ (ఫ్రాన్స్‌) 1890లో ఓ పెయింటింగ్‌ వేశారు. దాని పేరు ‘ఎట్‌ ద వాటర్‌’స్‌ ఎడ్జ్‌.’ నీటిపై కాంతి ప్రతిఫలనాన్ని వినూత్న రీతిలో చూపెడుతూ చేసిన చిత్రమిది. దాన్ని గీసేందుకు రంగులను పొరలు పొరలుగా అద్దారు. అవి కరుగుతున్నట్టుగా ఉంటాయి. దీనికి ఈ టైటిల్‌ ఇవ్వడం వెనుక చిత్రకారుడి ఉద్దేశం ఏమిటో తెలియదు. కానీ, పహల్‌గామ్‌ ఊచకోత ఇండియా, పాకిస్తాన్‌ దేశాలను సింధూ నది నీటి అంచున నిలబెట్టింది.

టిబెట్‌ పర్వతాల మీద 18,000 అడుగుల ఎత్తున మానస సరోవరం వద్ద పుట్టిన సింధూ నది వేల సంవత్సరాలుగా ఎన్నో నాగరికతలకు ఆలవాలమైంది. ఇటీవలి సంవత్సరాల్లో నదుల గురించి, వాటి చరిత్రల గురించి చాలా రచనలు వెలువడుతున్నాయి. బ్రిటిష్‌ చరిత్రకారుడు, ‘ద కాంక్వెస్ట్‌ ఆఫ్‌ నేచర్‌’ రచయిత డేవిడ్‌ బ్లాక్‌బోర్న్‌ ఇలా అంటాడు: ‘‘ప్రకృతిపై విజయం సాధించాలన్న మానవుడి తపన వెనుక అనేక ఊహలు ఇమిడి ఉంటాయి. మానవ, సాంకేతిక శక్తులతో ప్రకృతిని జయించాలని మనిషి అనుకుంటాడు. నదుల అస్తిత్వం పట్ల అతడి వైఖరి కూడా దీనికి ఒక కారణమవుతుంది’’.

నైలు నదిని మార్చిన ఫలితం?
నదులకు వ్యక్తిత్వం ఉందీ అనుకున్నా, అవి ఏం ఆలోచిస్తాయో తెలియదు. అయితే, నదుల గురించి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారో మనకు తెలుసు. నీటి ప్రవాహాన్ని క్యూసెక్కులలో లెక్కగట్టి వాటి స్వరూపాన్ని నిర్ణయిస్తాం. అంతే కాకుండా, వాటిపై ఆధారపడి ఉండే వృక్ష జంతుజాలం, ఆ నదులను పెనవేసుకుని ఉండే ఆచార వ్యవహారాలు, కల్పిత గాథలు ఆధారంగా వాటి గొప్పతనాన్ని అంచనా వేస్తాం.  

శత్రుదేశం మీద ప్రయోగించడానికి సింధూ నదిని ఒక అస్త్రంగా మార్చుకోవాలని ఇండియా భావిస్తోంది. నదులతో ఆడుకుంటే వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసిన విషయమే. నైలు నదీ స్వరూపాన్ని మార్చేయాలని 200 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడలేదు. ఆస్వాన్‌ డామ్‌ కట్టడంతో నైలు నదీ డెల్టాను వేల సంవత్సరాలుగా సారవంతం చేసిన ఒండ్రుమట్టి ఆ ప్రాంతంలో మేట వేయడం నిలిచిపోయింది. అంతేకాదు, నత్తగుల్లల ద్వారా వ్యాపించే  ప్రాణాంతక వ్యాధి శిస్టోమియాసిస్‌ ప్రబలడానికీ, మలేరియా వ్యాప్తికీ కారణమైంది.

నది మీద డ్యామ్‌ కడితే అది ఇక నదే కాదు. ‘‘నీటిని అదుపులోకి తెచ్చుకోవడమంటే, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే. హైడ్రలాజికల్‌ ప్రాజెక్టుల వల్ల అక్కడి మానవ ఆవాసాలు అంతరిస్తాయి. ఆ మానవ సమూహాల విలువైన పారంపరిక విజ్ఞానం శాశ్వతంగా కనుమరుగవుతుంది’’ అని కూడా బ్లాక్‌బోర్న్‌ రాస్తాడు.

భారీ నీటిని నిల్వ చేయగలమా?
కశ్మీర్‌ ‘పాకిస్తాన్‌ జీవనాడి’ అంటూ, పహల్‌గామ్‌ ఊచకోతకు కొద్దిరోజుల ముందు, పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. వాస్తవానికి సిం«ధూ నది ఈ రెండు దేశాలను యుద్ధం వైపు నడిపించే అవకాశం ఉన్నది! సైనిక ప్రతిచర్యలకు అదనంగా, ఇండియా 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేసింది. ఇండియా, పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు ఇన్నిసార్లు వచ్చినా ఇలా చేయడం ఇదే ప్రథమం. జల యుద్ధాలు సంభవించే ముప్పు ఉందంటూ కొన్ని దశాబ్దాలుగా భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిప్పుడు పరీక్షా సమయం. 

ఒప్పందం నిలిపివేయడంతోనే సిం«ధూ జలాలు దిగువకు ప్రవహించకుండా ఆగిపోవు. ఒక్క చుక్క నీటిని కూడా వదలం అంటూ జలశక్తి మంత్రి హెచ్చరించడం పాక్‌ను బెదిరించే రాజకీయ ప్రకటన. సిం«ధూ ప్రవాహాన్ని అకస్మాత్తుగా అపేయడం సాధ్యపడేది కాదన్నది మనకు తెలిసిన విషయమే. ‘‘నెత్తురు నీరు కలసి ప్రవహించ జాలవు’’ అని 2016 కశ్మీర్‌ ఉగ్రదాడి అనంతరం ఇండియా హెచ్చరించింది. అయితే, ఇస్లామాబాద్‌కు మద్దతుగా చైనా రంగంలోకి దిగిత్సాంగ్పో (బ్రహ్మపుత్ర) ఉపనది ప్రవాహాన్ని అడ్డుకుందని వార్తలు వచ్చాయి.

ఇండియా ప్రస్తుత జలవిద్యుత్‌ ప్రాజెక్టులతో భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయలేదు. ఇండస్‌ వాటర్‌ ట్రీటీ (1960) అందుకు అంగీకరించదు కూడా. ఒప్పందాన్ని పునః సమీక్షించడం కోసం, స్టోరేజ్‌ సదుపాయాల ఏర్పాటు కోసం దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు రచించిన వ్యూహం ఇది. ఇండియా ప్రస్తుతం 20 శాతం నీటినే వినియోగించుకోగలుగుతోంది. మరీ ఎక్కువగా నీరు నిల్వ చేస్తే వరద ముంపు ప్రమాదం ఎదురవుతుంది.

దౌత్యవ్యూహంగా సరే!
ఇరు దేశాలూ తమ జల వివాదాలను పరిష్కరించుకోడానికి 2022 నుంచీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. మారుతున్న జనాభా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందంపై పునఃసమీక్ష జరగాలని 2023లో ఇండియా ప్రతిపాదించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం అంటే వ్యయంతో కూడుకున్న పని. నీటి మళ్లింపు ఆర్థిక రీత్యా సాధ్యం కాకపోవచ్చు. చైనా సైతం త్సాంగ్పో నీటి మళ్లింపు విషయంలో ఈ కారణంతోనే సందిగ్ధంలో పడింది.

‘‘సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో ప్రత్యేకించి చీనాబ్‌ బేసిన్‌లో జలవాతావరణం భారీ మార్పులకు లోనవుతోంది. ఈ వాతావరణ మార్పుతో ఇప్పటికే మనం సమరం చేస్తున్నాం’’ అని ‘సౌత్‌ ఏషియా నెట్‌వర్క్‌ ఆన్‌ డామ్స్, రివర్స్‌ అండ్‌ పీపుల్‌’ (ఎస్‌ఏఎన్‌డీఆర్‌పీ) సమన్వయకర్త పరిణీతా దాండేకర్‌ చెబుతున్నారు.

ఇండియాలోని సింధూ పరీవాహక ప్రాంతపు పశ్చిమ నదులపై ఎక్కడా లేనన్ని జలవిద్యుత్‌ ప్రాజెక్టులు చీనాబ్‌ బేసిన్లో ఉన్నాయి (హిమాచల్‌ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్‌లో కొంతభాగం చీనాబ్‌ పరీవాహక ప్రాంతం కిందకు వస్తాయి). తొందరపడి మరిన్ని రిజర్వాయర్లు, ఆనకట్టలు నిర్మించాలని నిర్ణయిస్తే ఇండియా, పాకిస్తాన్‌ దేశాలు రెండూ ప్రకృతి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉంది. 

ఎస్‌ఏఎన్‌డీఆర్‌పీ బృందం 2024లో చీనాబ్‌ నది ఆసాంతం పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. ఇప్పటికే భూకంపాలు, నిరంతర వాతావరణ విపత్తులు ఎదుర్కొంటున్న చీనాబ్‌ నదీ ప్రాంతం మరిన్ని భారీ ప్రాజెక్టులను తట్టుకోలేదు. అయినా సరే నిర్మిస్తే పెను ఉపద్రవం తప్పదని ఈ నివేదిక హెచ్చరించింది. 

వీటివల్ల ఉత్పన్నమయ్యే జీవావరణ, భూగర్భ సంబంధిత దుష్పరిణామాలను సరిదిద్దడానికి వీలు కూడా కాదు. నదీజలాల మళ్లింపు వల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇక్కట్ల పాలవుతారు. లక్షల మంది నిర్వాసితులు అవుతారు. జలప్రవాహాన్ని నిలిపివేయడం తెలివైన దౌత్యవ్యూహమే కావచ్చు. కానీ నదీప్రవాహంతో ఆటలాడితే దీర్ఘకాలంలో ప్రమాదం తప్పదు.

కిసలయ భట్టాచార్జీ 
వ్యాసకర్త జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ కమ్యూనికేషన్‌ డీన్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement