ప్రశాంత జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలి?

Sri krishna And Arjuna Devotional Story By Gumma Vara Prasada Rao - Sakshi

అభయం, చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో నెలకొనడం,దానం, దమం,యజ్ఞం,వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం, అహింస, క్రోధరాహిత్యం, త్యాగం, శాంతి, చాడీలుచెప్పకపోవడం, సర్వప్రాణుల యందు దయ కలిగిఉండడం,విషయ. వాంఛలు లేకపోవడం, మృదుత్వం, బిడియం, చపలత్వం లేకపోవడం, ద్రోహబుద్ధి, దురభి మానం లేకుండడం, తేజస్సు, క్షమాగుణం, శుచిత్వం మొదలైన సద్గుణాలు. దైవీ సంపత్తితో మూర్తీభవించి ఉంటాయి అని శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పేడు. ఈ సద్గుణాలు కేవలం అర్జునునకో లేక ద్వాపర యుగానికో పరిమితమైనవి కావు. ఈ సమస్త విశ్వంలో మానవజాతి ఉన్నంత వరకు సర్వులకు అవసరమే. ఎన్ని అధునాతన సాధన సంపత్తి వున్నా మానవుడు ప్రశాంత జీవితాన్ని గడప లేక పోతున్నాడు.

ఎటు చూసినా హింస, క్రౌర్యం, అసంతృప్తి పెచ్చు పెరుగుతున్నాయి.  మానవతా విలువలు లేని వ్యక్తి అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆత్మ నిగ్రహం లేని వాడు ఉన్నతమైన జీవితాన్ని పొందలేడు. క్షణభంగురమైన ఇంద్రియ సుఖాల కోసం  పరుగులు తీస్తూ తన పతనానికి తానే కారణమౌతున్నాడు. మనిషి జీవిత ధ్యేయం ఇంద్రియసుఖానుభవం కాదు. ఇంద్రియాలను ఎప్పటికీ తృప్తి పరచలేము. అగ్నిలో ఆజ్యం పోసినట్లు సుఖాలు అనుభవించే కొద్ది మరిన్ని కోరికల పుడతాయి. కాని మనిషి తృప్తి చెందడు. మానవ జీవితానికి ఉన్నతమైన లక్ష్యం ఉండాలి.

అలా కాని పక్షంలో మానవుడు సర్వావస్థలయందు అసంతృప్తి కలిగే ఉంటాడు. మనిషిలో జ్ఞాన కాంక్ష పెరిగే కొద్దీ అతడు ఉన్నతంగా తీర్చబడతాడు. మన ఆలోచనా రీతిని బట్టే మన ఆచరణ ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టినప్పుడే మనిషికి నిజమైన శాంతి.'పరోపకారః పుణ్యయ పాపాయ పరపీడనం' ఎదుటి వాడికి ఉపరకారం చేయడం పుణ్యం అపకారం చేయడం పాపమని మన సనాతన ధర్మం నొక్కి వక్కా ణించింది.
అనభిధ్య పరస్వేషు, సర్వ సత్త్వేషు హృదయం ।
కర్మ ణాం ఫలమస్తీత మనసా త్రితయంచరేత్ ॥

పరుల సొత్తుపై ఆశ లేకుండా ఉండడం, సర్వజీవులయందును కరుణ, కర్మకు ఫలితం ఉండి తీరుతుందనే భావం ఈ మూడింటినీ మనస్సులో ఉంచుకొని ప్రవర్తించాలని మనుస్మృతి చెబుతుంది.
-గుమ్మా ప్రసాద రావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top