
వ్యవసాయ గణాంకాల్లో మరింత కచ్చితత్వం
ఉపగ్రహాల డేటాతో పైలట్ అధ్యయనాలు
93–95% కచ్చితత్వంతో ఫలితాలు
ఈ ఖరీఫ్ నుంచి డిజిటలీకరణకు సన్నాహాలు
సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి గణాంకాలు
దేశంలో సగానికిపైగా ప్రజలకు జీవనాధారం వ్యవసాయమే. అలాంటి ప్రధాన రంగానికి సంబంధించి కచ్చితమైన గణాంకాల సేకరణ ఇన్నాళ్లూ కలగానే ఉంది. మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఆధారిత అంచనాల సేకరణ ప్రారంభం కావటంతో కచ్చితత్వంతో కూడిన గణాంకాల సేకరణకు మార్గం సుగమమైంది.
ఇప్పటికే పైలట్ అధ్యయనాలు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్లు డిజిటల్ సర్వే గుర్తించింది. ఇది వ్యవసాయ గణాంకాల నమోదు ప్రక్రియలో పెద్ద ముందడుగు. కేంద్ర వ్యవసాయ శాఖ చొరవతో; రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాగు లెక్కల సేకరణ, డిజిటలీకరణ ఇక పక్కాగా జరగనుంది. – సాక్షి, సాగుబడి
దేశంలో వ్యవసాయ రంగంలో గణాంకాల ప్రక్రియ కొంత సంక్లిష్టంగా, సుదీర్ఘ ప్రక్రియగా ఉంది. గ్రామస్థాయిలో సిబ్బంది భూమి రికార్డు పుస్తకాల్లో సాగు విస్తీర్ణం, పంటల వివరాలను నింపుతారు. ఖరీఫ్ జూన్లో ప్రారంభమైనప్పటికీ పంట అంచనాలకు సంబంధించిన గణాంకాలు అరకొరగానే అందుతుండేవి. ఈ గణాంకాలను అనేక సార్లు సవరించేవారు.
చివరికి ఎప్పటికో తుది అంచనాలు పాలకులకు అందుబాటులోకి వచ్చేవి. అయితే, శాటిలైట్ డేటాతో అనుసంధానం చేసి వ్యవసాయ గణాంకాల సేకరణను డిజిటలీకరించటంతో సెప్టెంబర్ నాటికే తొలి అంచనాలు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయ గణాంకాల డిజిటలీకరణ దిశగా ఇది చాలా పెద్ద ముందుడుగని చెప్పుకోవచ్చు.
పూర్తయిన పైలట్ అధ్యయనాలు
వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా; ముందస్తు మార్కెటింగ్ సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు చేపట్టాలన్నా.. నమ్మకమైన గణాంకాల సేకరణ అత్యంత కీలకం. ఇప్పుడు ఈ సమస్యను అధిగమించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేశాయి. ‘వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పైలట్ అధ్యయనాలు పూర్తయ్యాయి. ఫలితాలు 93–95% కచ్చితత్వంతో వచ్చాయి.
గణాంకాలను మాన్యువల్గా నమోదు చేసినప్పటితో పోలిస్తే ఇది చాలా మెరుగు. అందువల్ల ఈ ఏడాది ఖరీఫ్ నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో శాటిలైట్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నాం. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పండించారు, దిగుబడుల తొలి డిజిటల్ అంచనాలను సెప్టెంబర్ నాటికే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశాం’అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
2024లోనే డిజిటల్ క్రాప్ సర్వే
సాధారణంగా భూమి రికార్డులు నిర్వహించే గ్రామస్థాయి సిబ్బంది (గిరిదవారీ పద్ధతి) ప్రతి ఏటా సాగయ్యే పంటల వివరాలు, విస్తీర్ణం, దిగుబడి అంచనాలు తదితర వివరాలను పుస్తకాల్లో నమోదు చేస్తూ, అనేక దఫాలు సవరిస్తూ ఉండేవారు. దాంతో అనిశ్చితి నెలకొనేది. అటువంటి అనిశ్చితికి స్వస్తి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ గణాంకాల సేకరణ వ్యవస్థను మెరుగుపరిచే పనికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర వ్యవసాయ శాఖ గత ఏడాది నుంచి పంటల సాగు వివరాలపై శాటిలైట్ ఆధారిత గణాంకాల సేకరణ ప్రారంభించింది.
2024 ఖరీఫ్లో డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంటల విస్తీర్ణం, తదితర గణాంకాల డిజిటలీకరణ జరిగింది. దాదాపు కచ్చితమైన పంట అంచనాల సేకరణ సాధ్యపడింది. ఉత్తరప్రదేశ్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్లు ఆ డిజిటల్ సర్వే గుర్తించింది. ఆ అనుభవాలతోనే ఈ ఏడాది అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ పద్ధతుల్లో శాటిలైట్ ఆధారిత గణాంకాల సేకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కొత్త పంటల వివరాలూ..
పంటల మార్పిడి గురించి, కొత్త పంటల సాగుకు సంబంధించి గణాంకాల వివరాలు గతంలో లభించేవి కాదు. సంప్రదాయకంగా సాగయ్యే వరి, మొక్కజొన్న, జొన్న వంటి 25–26 రకాల పంటల వివరాలు మాత్రమే గణాంకాల్లోకి చేరేవి. ఇప్పుడు శాటిలైట్ డేటా ఆధారంగా డిజిటల్ గణాంకాల సేకరణతో ఈ సమస్య తీరనుంది. బెర్రీస్, అవొకాడో, డ్రాగన్ఫ్రూట్, కివి వంటి కొత్తపంటల సాగును సైతం ఇప్పుడు నమోదు చేస్తున్నారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.