
మేఘాల మధ్య విస్తరించిన మేఘాలయ. ఛిల్ అవమని ఆహ్వానిస్తున్న షిల్లాంగ్. నాలుగు వేల అడుగుల ఎత్తులో సరస్సు. అంతకు వెయ్యి అడుగుల ఎత్తుల జలపాతం. బౌద్ధంలా విస్తరించిన ప్రశాంత విహారం. ఏడు పాయల సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్. కేథడ్రల్ చర్చ్ వందేళ్ల చారిత్రక గ్రంథం. సంతోషాల విలాసభవనం పునాఖ ద్జోంగ్. భారత్ – భూటాన్ మౌంటెయిన్ టూర్... వీటన్నింటినీ దండలా కూర్చి చూపిస్తోంది.
సోమవారం ‘‘ 9–6–2025
భారత్ భూటాన్ మిస్టిక్ మౌంటెయిన్ టూర్...
ఇది 14 రోజుల యాత్ర. రైలు ఢిల్లీలో మొదలై గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి, థింఫు, పునఖ, పారో మీదుగా ఢిల్లీకి చేరుతుంది. ఢిల్లీలోని సఫ్దర్గంజ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా జంక్షన్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో రైలెక్కవచ్చు. ఈ టూర్ ఈ నెల 28వ తేదీన మొదలవుతుంది.
టికెట్ ధరలు ఏసీ కూపేలో (డబుల్ షేరింగ్) ఒక్కొక్కరికి లక్షా అరవై వేలవుతుంది. ఏసీ క్యాబిన్లో సింగిల్ షేరింగ్ లక్షా డెబ్బయ్ ఐదు వేలు, డబుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి లక్షా నలభై ఐదు వేలు. డీలక్స్ (ఏసీ టూ టైర్)లో డబుల్ షేరింగ్ లక్షా ముప్పై వేలు, కంఫర్ట్ (థర్డ్ ఏసీ) కేటగిరీలో డబుల్ షేరింగ్ ఒక్కొక్కరికి లక్షా ఇరవై వేలవుతుంది.
ఇవన్నీ ఉండాలి: ఈ టూర్లో విదేశీ పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణికులు పాన్ కార్డు, పాస్పోర్టు (ఆరు నెలల కనీస గడువు ఉండాలి) లేదా ఓటర్ ఐడీ కార్డు (హోలోగ్రామ్ తప్పనిసరి), పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు (వైట్ బ్యాక్ గ్రౌండ్) ఉండాలి.
1వ రోజు: మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. రైలు బయలుదేరగానే ప్రయాణికులకు హై టీ, రాత్రి భోజనం అందిస్తారు. రాత్రంగా ప్రయాణం కొనసాగుతుంది.
2వ రోజు: ఈ రోజంతా కూడా ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఉదయం టీ నుంచి రాత్రి భోజనం వరకు ఆహారపానీయాలను అందిస్తారు. ఆ రాత్రి కూడా ప్రయాణం సాగుతుంది.
3వ రోజు: మధ్యాహ్న భోజనం తర్వాత రైలు గువాహటికి చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవ్వాలి. సాయంత్రం ఫ్రీ టైమ్. రాత్రి బస అదే హోటల్లో.
4వ రోజు
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత రూమ్ చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. కామాఖ్య ఆలయంలో ముఖ దర్శనం చేసుకుని షిల్లాంగ్ వైపు సాగిపోవాలి. ఉమియుమ్ లేక్ మీదుగా సూర్యాస్తమయాన్ని వీక్షించి హోటల్ గదిలో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస షిల్లాంగ్లో.
మేఘాల కింద విహారం
మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ప్రధానమైన నీటి వనరు ఉమియుమ్ లేక్. ఇది సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతి.
5వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత చిరపుంజి వైపు సాగిపోవాలి. సెవెన్ సిస్టర్స్ జలపాతంతో సేదదీరి మావ్సామాయ్ గుహలు, నొఖాలికాయ్ జలపాతాలకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం తర్వాత ఎలిఫెంటా జలపాతాన్ని చూసుకుని హోటల్ గదికి వచ్చి సేదదీరాలి. ఆ రాత్రి బస కూడా షిల్లాంగ్లోనే.
ఏడు జలధారలు
సెవెన్ సిస్టర్స్ జలపాతం మేఘాలయలో ప్రసిద్ధి. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటుంది. ఇది ఏడు పాయలుగా జాలువారుతుండంతో ఆ పేరు వచ్చింది. స్థానికులు నోహ్స్నిగిథియాంగ్ జలపాతం అంటారు. సముద్రమట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో వెయ్యి అడుగుల పై నుంచి కొండ వాలు నుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తుంది. మన దక్షిణాది వాళ్లకు కర్నాటకలోని జోగ్ వాటర్ఫాల్స్ పరిచితం. ఇది నాలుగు పాయలుగా ఉంటుంది. ఇవి రెండూ దేశంలో టాప్ టెన్ జలపాతాల్లో చోటు చేసుకున్నవే.
6వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి సైట్ సీయింగ్కి సాగిపోవాలి. కేథడ్రల్ చర్చ్, వార్డ్స్ లేక్, డాన్ బాస్కో మ్యూజియం తర్వాత గువాహటికి ప్రయాణం. గువాహటిలో బ్రహ్మపుత్ర క్రూయిజ్లో విహరిస్తూ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన తర్వాత ప్రశాంతంగా గువాహటి రైల్వేస్టేషన్కి చేరి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. హాసిమరా వైపు ప్రయాణం రాత్రంతా సాగుతుంది.
ఏడంతస్థుల మ్యూజియం
షిల్లాంగ్లోని కేథడ్రల్ చర్చ్కి వందేళ్లకు మించిన చరిత్ర ఉంది. దీనిని 1913లో పూర్తిగా చెక్కతో నిర్మించారు. అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో తిరిగి కాంక్రీట్ నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణానికి 85 ఏళ్లు. యూరప్ దేశాలు పాటించి గోథిక్ శైలి నిర్మాణం ఇది. ఇంటీరియర్లో జర్మనీ శైలి కళాత్మకతలోని లాలిత్యం ఉంటుంది. ఇక డాన్ బాస్కో మ్యూజియం ఏడంతస్థుల భవనం. ఈశాన్య రాష్ట్రాల కళాకృతుల నిలయం. మనసు నిండుగా చూడాలంటే మూడు గంటల సమయం కేటాయించాల్సిందే. టూర్లో ఆ మేరకు సమయం ఇస్తారు. ఆవరణలో ఫొటోలు తీసుకోవడంలో ఎక్కువ సమయం గడిచిపోయిందంటే మ్యూజియంలోని కళాకృతులను సరగ్గా చూడలేం.
7వ రోజు
రైల్లోనే బ్రేక్ఫాస్ట్. హాసిమరా స్టేషన్లో రైలు దిగి రోడ్డు మార్గాన ఫుయెంట్షోలింగ్, తర్వాత థింఫూకి సాగిపోవాలి. థింఫూ కి చేరిన తర్వాత హోటల్ గదిలో చెక్ అని సాయంత్రం విశ్రాంతిగా గడపాలి. రాత్రి బస అక్కడే.
భూటాన్లో అడుగుపెట్టాం!
హసిమరా రైల్వేస్టేషన్ వెస్ట్బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ దిగి రోడ్డు మార్గాన వెళ్లాలి. భారత్ సరిహద్దు దాటి భూటాన్లో అడుగుపెట్టిన తర్వాత ఇరవై కిలోమీటర్ల దూరంలో ఫుయెంట్షోలింగ్ అనే చిన్న పట్టణానికి చేరుతాం. ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు.
8వ రోజు
ఈ రోజంతా థింఫూలో సైట్ సీయింగ్లో గడుస్తుంది. బుద్ధపాయింట్, మోతీతాంగ్ జూ, పెయింటింగ్ స్కూల్, నేషనల్ లైబ్రరీ, బౌద్ధ సంస్కృతికి సంబంధించి పురాతన గ్రంథాల సముదాయాన్ని వీక్షించడం, థింపూ హాండీక్రాఫ్ట్స్ మార్కెట్ పర్యటన, తాషి చో ద్జోంగ్ వీక్షణం తర్వాత హోటల్కి చేరి రాత్రి బస.
గ్రేట్ బుద్ధ
భూటాన్ రాజధాని నగరం థింపూ. ఈ నగర శివారులో బుద్ధ డోర్డెన్మా విగ్రహం ఉంది. 177 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోని అత్యంత పెద్ద బుద్ధ విగ్రహాల జాబితాలో లిస్ట్ అయింది. ప్రపంచానికి శాంతి, సంపదలు దక్కాలని కోరుకుని దీనిని నిర్మించారు. గ్రేట్ బుద్ధగా వ్యవహరిస్తారు. ఇది ్రపాచీనమైనది కాదు. ఇరవై ఏళ్ల కిందట నిర్మాణం మొదలైంది. ్రపారంభించి పదేళ్లవుతోంది.
చిన్ని చిత్రాలయం
థింపూలో ఉన్న జాతీయ స్థాయి పెయింటింగ్ స్కూల్ పరిమాణంలో చిన్నది. కానీ ఇందులో పిల్లలకు పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, శిల్పకళ, స్కెచింగ్, ఉడ్ కార్వింగ్ వంటి అనేక కళల్లో శిక్షణనిస్తారు. విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగని విధంగా పర్యాటకులు నిశ్శబ్దం పాటించాలి.
9వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన పునఖా వైపు సాగుతుంది ప్రయాణం. దారిలో ఆగుతూ దోచులా పాస్, చోర్టెన్, మణివాల్, ప్రేయర్ ఫ్లాగ్స్ను చూసుకుంటూ మధ్యాహ్యానికి పునఖా ద్జోంగ్, మేల్ రివర్, ఫిమేల్ రివర్ వీక్షణం. సస్పెన్షన్ వంతెన మీద విహారం, ΄్యాలెస్ ఆఫ్ హ్యాపీనెస్ సందర్శనం తర్వాత సాయంత్రం పునాఖాలో హోటల్కు చేరి చెక్ ఇన్ అయి రాత్రి బస చేయాలి.
సంతోష భవనం
ఈ భవనాన్ని స్థానిక వ్యవహారంలో పునాఖ ద్జోంగ్ అంటారు. పునాఖ నగరం భూటాన్కి రాజధానిగా ఉన్నప్పుడు రాజ్యపాలన ఇక్కడి నుంచే జరిగేది. ఈ భవనానికి చారిత్రక ్రపాధాన్యం ఉండడంతో రాజధాని థింపూకి మారిన తర్వాత పర్యాటక భవనంగా మార్చారు. టిబెట్ బౌద్ధం విలసిల్లిన ప్రదేశం ఇది. ఇప్పుడిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల పరిశీలన జాబితాలో ఉంది.
10వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత పునాఖాలో హోటల్ గది చెక్ అవుట్ చేసి పారో వైపు సాగిపోవాలి. దారిలో లంపేరీ రాయల్ బొటానికల్ పార్క్, పారో నది మీదున్న తామ్చోగ్ లాఖాగ్ ఐరన్ బ్రిడ్జ్ విహారం, పారో ద్జోంగ్ (రింన్పుంగ్ ద్జోంగ్), కోట సందర్శన తర్వాత ద్జోంగ్ఖాగ్ సందర్శనం. రాత్రి బస పారోలోనే.
వంతెన మీద సూర్యాస్తమయం
పారో నగరంలో ఉన్న బౌద్ధ క్షేత్రం రిన్పుంగ్ ద్జోంగీ. ్రపాచీనకాలంలో ఈ ప్రదేశాన్ని పాలించిన రాజవంశాలు నివసించిన ప్రదేశం. వారు బౌద్ధాన్ని ఆచరించడంతో ఆ పరంపరగా వచ్చిన బౌద్ధక్షేత్రం ఇది. దీనిని యునెస్కో పరిశీలన జాబితాలోకి తీసుకుంది. నది కి ఇరు వైపులా రెండు భవనాలను కలుపుతూ ఉన్న వంతెన మీద నుంచి సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతి.
11వ రోజు
రోజంతా పర్యటన పారోలో ప్రశాంతంగా సాగుతుంది. టైగర్ నెస్ట్ బేక్క్యాంప్ పాయింట్లో ఫొటో సెషన్, నేషనల్ మ్యూజియం సందర్శనం, తా ద్జోంగ్ (వాచ్ టవర్) నుంచి ప్రకృతి వీక్షణం, భూటాన్ సంప్రదాయ హస్తకళాకృతుల వీక్షణం, మధ్యాహ్న భోజనం తర్వాత భూటాన్ జాతీయ క్రీడ ఆర్చరీ సాధన, విన్యాసాలను వీక్షించడం, చివరగా ఔషథ నీటితో హాట్ స్టోన్ బాత్ చేయించుకుని హోటల్కి చేరడం. ఈ రాత్రి కూడా బస పారోలోనే.
రాతితో ఔషథ స్నానం
ఇది ఇక్కడ ఆయుర్వేద చికిత్స. యాభై రకాల మానసిక, శారీరక అనారోగ్యాలతోపాటు ఆధ్యాత్మిక భావనలను పెం΄÷ందించే చికిత్స. హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించిన ఈ నేలకు ఔషధాల పుట్టిల్లు అని పేరు. ఇక్కడ నీటిలో ఔషథ పత్రాలను వేసి మరిగిస్తారు. రాళ్లను వేడి చేసి ఆ నీటిలో వేస్తారు. ఆ తరవాత ఆ రాళ్లను ఒక చట్రంలో అమర్చి ఒంటికి హాయి కలిగేటట్లు మర్దన చేయడమే హాట్ స్టోన్ బాత్. మోడరన్ లైఫ్ స్టైల్లో ఒత్తిడి, హైపర్ టెన్షన్, జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. వీటన్నింటి నుంచి ఉపశమనం ΄÷ందడానికి హాట్ స్టోన్ బాత్ దోహదం చేస్తుంది. కేరళలో తైలాలతో చేసే చికిత్స వంటిదే ఇది.
12వ రోజు
బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన హసిమరా రైల్వేస్టేషన్కు సాగిపోవాలి. దారిలో లంచ్ తర్వాత స్టేషన్కి చేరి రైలెక్కిన తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. పదమూడవ రోజు మొత్తం రైల్లోనే. పద్నాలుగవ రోజు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎనిమిది గంటలకు రైలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ స్టేషన్కు చేరడంతో యాత్ర పూర్తవుతుంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి