పండ్లలో రారాజుగా కీర్తించే మామిడపండ్లు వచ్చే కాలమే ఈ వేసవి. ఈ సమయంలో ఎటుచూసినా..ఈ పండ్ల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ పండ్లను తినేమందు నీటిలో నానబెట్టడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి. ఇది కేవలం మామిడి పండ్లను శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదని..అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలందించే విధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇలా నీటిలో నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడటమే గాక శరీర ఉష్ణోగ్రతన నియంత్రించి, జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుందని అంటున్నారు. ఈ మామిడిలో విటమిన్లు ఏ,సీల తోపాటు, పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి శక్తి కేంద్రం అయినప్పటికీ..పచ్చి రూపంలో కొన్ని జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. అయితే ఈ పండు మన జీర్ణక్రియకు సురక్షితమైనదిగా ఉండాలంటే..ఈ సమ్మేళనాల ప్రభావాన్ని తగ్గించేలా నీటిలో అరగంటపాటు నానబెట్టక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా చూద్దామా..!.
ఫైటిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడం:
మామిడి పండ్లను నానబెట్టమని సిఫార్సు చేయడానికి ప్రాథమిక శాస్త్రీయ కారణం ఫైటిక్ ఆమ్లం ఉండటమే. ఫైటిక్ ఆమ్లం అనేది వివిధ మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే ఒక సహజ పదార్ధం. ఇది ఫాస్ఫరస్ను నిల్వ చేసే రూపంగా పనిచేస్తుంది. పోషకాహార శాస్త్ర ప్రకారం..ఖనిజాల జీవ లభ్యతపై దాని ప్రభావం కారణంగా దీనిని తరచుగా "పోషక విరోధి"గా వర్గీకరిస్తారు.
జీర్ణవ్యవస్థలో కాల్షియం, ఇనుము, జింక్ వంటి అవసరమైన ఖనిజాలతో బంధం ఏర్పరచుకోవడానికి ఫైటిక్ ఆమ్లానికి అధిక అనుబంధం ఉంటుంది. ఈ ఖనిజాలు ఫైటిక్ ఆమ్లంతో బంధం ఏర్పరచుకున్నప్పుడు, అవి కరగని అవక్షేపాలను ఏర్పరుస్తాయి. అయితే వీటిని మానవ శరీరంలోని చిన్న ప్రేగు గ్రహించలేదు. అందువల్ల ఈ మామిడి పండ్లను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల, వాటిలోని అదనపు ఫైటిక్ ఆమ్లం కరిగిపోవడం లేదా విచ్ఛిన్నం కావడం జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ "యాక్టివేషన్" ప్రక్రియ కారణంగా పండులోని సూక్ష్మపోషకాల పూర్తి పోషక విలువను సులభంగా పొందగలమని చెబుతున్నారు.
మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం..
జీర్ణవ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే అధికంగా ఉండే ఫైటిక్ యాసిడ్ ఇనుము, జింక్, కాల్షియం వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎప్పుడైతే సుమారు 30 నిమిసాలు నానబెడతామో అప్పుడు ఈ పోషక వ్యతిరేక పదార్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా పండు మంచి పోషకవంతమైనదిగా, అలాగే జీర్ణవ్యవస్థకు సులభంగా జీర్ణమయ్యేదిగా మారుతుంది.
ఉష్ణోత్పత్తిని తగ్గించి శరీరానికి చలువ చేసేలా..
మామిడిలో కేలరీలు అధికం, సహజ చక్కెరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇది నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే జీవక్రియ వేడిని పెంచడానికి దారితీస్తుంది. శరీరంలో అంతర్గత వేడి చర్మంపై ప్రభావం చూపి దద్దుర్లు, మొటిమలు లేదా వేడి కురుపులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో ఇవి సాధారణంగా కనిపించే సమస్యలు.
ఈ వేడి కారణంగా కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అంటున్నారు. మనం ఎప్పుడైతే మామిడి పండుని నీటిలో నానబెడతామో అప్పుడు దానిలోని సహజ వేడి ఆవిరైపోతుంది. మానవ శరీర అంతర్గత వాతావరణానికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే పేగులు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
రసాయన అవశేషాల నిర్మూలన
ఈ మామిడి పండ్లు పండించేందుకు కృత్రిమ పురుగుల మందులు, శిలీంధ్రనాశకాలు వంటివి అధికంగా వినియోగిస్తారు రైతులు. అంతేగాక పండు ఉపరితలంపై కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలను చల్లుతారు. ఫలితంగా రవాణ సమయంలో పండు డ్రై అయిపోకుండా తేమతో ఉండేలా చేయడమేగాక, నిల్వ కాలాన్ని పొడిగిస్తాయి. అలాగే వాణిజ్య మామిడి పండ్డు అందంగా కనిపించేలా పలుచటి మైనపు పొరను పూస్తారు కూడా.
అందువల్ల ఇలాంటి మామిడిపండ్లను పారే నీటి కింద త్వరగా కడగడం, 30 నిమిషాలపాటు నానబెట్టడం వంటి వాటి వల్ల ఆయా రసాయనాల అవశేషాలు సమర్థవంతంగా తొలిగిపోవడమే గాక సురక్షితమైన ఆహారంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇలా నానబెట్టడం వల్ల మామిడి కాండం వద్ద ఉండే జిగురు లేదా లేటెక్స్ అనే రసం ఘాటు తొలిగిపోతుందట. ఈ రసం గనుక నోటిలోకి వెళ్తే నోటి చుట్టూ వాపు, దురద, బొబ్బలు వంటి చర్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.
(చదవండి: హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!)


