
పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి జరిగే వార్షిక కార్యక్రమాన్ని ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే) అంటున్నాం. ఈనాడు పర్యావరణ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడానికీ, పర్యావరణ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికీ ప్రపంచవ్యాప్తంగా 1970 ఏప్రిల్ 22 నుండి ఈ ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ 55వ వార్షిక దినోత్సవానికి ఎంపిక చేసిన విషయం ‘మన శక్తి–మన గ్రహం’. ఈ సంద ర్భంగా ‘భూమి మొదట – మిగిలినవన్నీ తరువాత’ అనీ, ‘ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించి స్థానికంగా వ్యవహరించండి’ అనీ పిలుపు ఇస్తు న్నారు. అంతేకాదు ‘పరిశుభ్రమైన భూమి – ప్రకాశవంతమైన భవి ష్యత్’ అని గుర్తు చేస్తున్నారు.
భూమి ఉపరితలం 70 శాతం నీరు, 30 శాతం భూమి మాత్రమే కలిగి ఉంది. మహా సముద్రాలు, నదులు, సరస్సులు, హిమనీ నదాలు, సముద్రాల వంటివి ముఖ్యమైన నీటివనరులు. పర్వతాలు, కొండలు, పీఠ భూములు, మైదానాలు వంటివి ముఖ్యమైన భూరూపాలు. నీటిలో కానీ, నేలపై కానీ మానవునితో సహా వృక్షాలు, జంతువులు, కీటకాలు వంటి జీవులు లెక్కకు మించి జీవిస్తున్నాయి. భూమిని కాపాడుకోకపోతేఇందులో కొన్ని అదృశ్యం అయిపోయే ప్రమాదం ఉంది. శిలాజ ఇంధనాలు మాత్రమే మన గ్రహానికి శక్తి నివ్వగలవనే అబద్ధాన్ని సంవత్సరాలుగా కొన్ని శక్తులు మనకు చెబుతూనే ఉన్నాయి. కానీ శిలాజ ఇంధనాలు ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గా రాలకు ప్రధాన వనరులు. ఇవి గ్లోబల్ వార్మింగ్కు ప్రత్యక్షంగా దోహదం చేస్తాయి. ఫలితంగా శ్వాసకోశ సమస్యల నుండి కేన్సర్ వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి శిలాజ ఇంధనాలుమండినపుడు కార్బన్ డై ఆక్సైడ్ పుడుతుంది. పూర్తిగా మండని
ఇంధనం నుండి వచ్చే పొగలో కూడా కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. కుళ్లిన పదార్థాల నుండి, చెత్త గుట్టల నుండి, వరి పంట నుండి మీథేన్ వాయువు వెలువడుతుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి కలిసి సూర్యుని నుండి వచ్చిన వేడిని గ్రహించి బయటకు పోనీ యకుండా పట్టేస్తాయి. మానవులతో సహా జంతువులు, పక్షులు శ్వాస క్రియలో భాగంగా ఆక్సిజన్ వాడుకుని కార్బన్ డై ఆక్సైడ్ను వదిలి వేస్తాయి. మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్,క్లోరో ఫ్లోరో కార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి కొన్ని రకాల వాయువులు పరారుణ కిరణాలను పీల్చుకుని ఇముడ్చుకుంటాయి. ఫలితంగా వేడిమి పెరిగి ప్రపంచ వాతావరణంలో మార్పులు వస్తు న్నాయి. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు.
మనకు శక్తి అవసరం. దానిని పొందడానికి మన గ్రహం యొక్క వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి. శిలాజ ఇంధనాలు పరిమితమైనవి. ఎప్పటికైనా అయిపోయేవే. పునరుత్పాదక ఇంధ నాలపై ఇప్పటికే దృష్టి సారించారు. పునరుత్పాదక శక్తి అనేది గేమ్–ఛేంజర్. ఇది చౌకైనదే కాక స్థిరమైన విద్యుత్ను అందిస్తుంది. దీని వలన వాతావరణ మార్పులు ఉండవు. మానవ ఆరోగ్యానికి ఏ విధమైన హానీ ఉండదు. సౌర, పవన, జల, భూ ఉష్ణం, అలలు వంటివి పునరుత్పాదక శక్తులు. ఈ వనరులు ఎప్పటికీ తరిగిపోవు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధన ఉత్పత్తి మూడు రెట్లు పెరగాలని ఆశిస్తున్నారు. ఈ లక్ష్య సాధనకై సమష్టి కృషి అవసరం.
ఆస్ట్రేలియాలోని ఇళ్ళలో మూడింట ఒక వంతు ఇప్పటికే సౌర శక్తిని ఉపయోగిస్తున్నారు. ఐస్లాండ్, నార్వే, ఇథియోపియాలు ఎక్కువగా శక్తిని పునరుత్పాదక వనరుల నుంచేపొందుతున్నాయి. ఉరుగ్వే పునరుత్పాదక వనరుల నుండి 98 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. డెన్మార్క్ పవన టర్బైన్ల ద్వారా 50 శాతంకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది. ఈ విషయంలో ఆఫ్రికాలో కెన్యా అగ్రగామిగా ఉంది. దాని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం భూ ఉష్ణ శక్తి ద్వారా లభిస్తోంది. మన దేశంలో కూడా సౌర శక్తి వినియోగం బాగా పెరుగుతోంది. తమిళనాడు, రాజస్థాన్, మహా రాష్ట్ర్టలలో పవన విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సౌర ఫలకాలు, పవన టర్బైనులు నిర్మించడానికి కాడ్మియం, రాగి, వెండి ఎంతో అవసరం. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలుతీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు.
డా.సి.వి. సర్వేశ్వర శర్మ
పాపులర్ సైన్స్ విషయాల రచయిత
(నేడు 55వ ‘ధరిత్రీ దినోత్సవం)