తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మారంపల్లి వద్ద ఎర్ర కాలువ గట్టును తవ్వి సరిహద్దు చేలలో కలిపేసుకుంటున్న సంఘటన స్థానిక రైతుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా రైతులు సారిక సత్యనారాయణ, శ్రీనివాసరావు, నిడదవోలు రమేష్బాబు మాట్లాడుతూ ఎర్ర కాలువకు సంబంధించిన గట్టును గత కొంతకాలంగా తవ్వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన రైతు వెంపల్లి రాంబాబు 95 సెంట్లు భూమి ఉందని, ఎర్ర కాలువ గట్టును తవ్వి దానిని మూడెకరాలకు విస్తరించినట్లు తెలిపారు. దీంతో గట్టు బలహీనంగా మారే అవకాశం ఉందని, మారంపల్లి, పరిసర గ్రామాల్లోని వేలాది ఎకరాలు వరద సమయంలో ముంపు బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంపల్ల రాంబాబు, అతని సోదరుడు ఈ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎర్ర కాలువ గట్టు, మురుగునీటి డ్రెయిన్ ఆక్రమణలను తొలగించి, ముంపును అరికట్టాలని అధికారులను కోరారు. లేకుంటే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
గట్టు తవ్వి కలిపేసుకుంటున్న రైతులు


