భీమవరం: పేదలకు అండగా ఉంటామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ డి.కళ్యాణి ప్రశ్నించారు. భీమవరంలో సోమవారం నిర్వహించిన శ్రామిక మహిళా రంగం జిల్లా సదస్సుకు చింతపల్లి లక్ష్మి, ఆర్.భాగ్యలక్ష్మి, గోవిందమ్మ అధ్యక్షత వహించారు. సదస్సులో కళ్యాణి మాట్లాడుతూ అన్నిరంగాల్లో సగ భాగంగా ఉన్న మహిళలకు నేటికీ సరైన గుర్తింపు లేదని, సమాన పనికి సమాన వేతనం లేకపోగా ఉద్యోగ భద్రత, లైంగిక వేధింపులు వంటి అనేక సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూటీలో గంటల తరబడి నిలబడే పనిచేయాల్సి వస్తుందని కనీసం వసతులు కల్పించడం లేదని వాపోయారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, లైంగిక వేధింపులు అరికట్టడం వంటి వాటికి సీఐటీయు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.


