ఏలూరు (ఆర్ఆర్పేట) : వేసవిలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఆ శాఖ డిప్యూటీ కంట్రోలర్ పీవీ రంగారెడ్డి ఆదేశాల మేరకు నూజివీడు ఇన్స్పెక్టర్ సీహెచ్ వాసుదేవరావు తన సిబ్బందితో కలిసి గత శని, సోమవారాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కొత్త బస్టాండు, పాత బస్టాండు, ఏలూరు రైల్వేస్టేషన్, ఏలూరు రూరల్ పరిధిలోని పలు దుకాణాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. శీతల పానీయాలపై ముద్రించిన ధరలకటే అధిక ధరలకు విక్రయిస్తున్న 15 దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీ రంగారెడ్డి మాట్లాడుతూ నికర ధర కంటే అదనపు ధరకు ఎవరైనా విక్రయిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేస్తామని హెచ్చరించారు.


