పెంటపాడు: జట్టు పనిచేసే వ్యక్తి స్వగ్రామం వెళుతూ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. స్థానికులు, పెంటపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడపాడు గ్రామానికి చెందిన సబ్బవరపు ధనరాజు (33) ఆదివారం రాత్రి పొద్దుపోయాక పని ముగించుకొని గూడెం నుంచి స్వగ్రామం బోడపాడు మోటార్సైకిల్పై వెళుతుండగా బిళ్లగుంట వద్ద ప్రమాదవశాత్తూ బైక్ నుంచి జారి పడి తీవ్ర గాయాలయ్యాయి, స్థానికులు గమనించి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతూ ధనరాజు మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై స్వామి ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ మట్టా సత్యనారాయణ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.
ఏలూరు రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 16వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఏలూరు కస్తూరిభా బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి, కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాలికలు, సబ్జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ ఎంపికలు ఉంటాయన్నారు. జూనియర్ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2008 తర్వాత, సబ్జూనియర్ విభాగంలో బాలబాలికలు జనవరి 1, 2013 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఆసక్తి గల గల క్రీడాకారులు పుట్టినతేదీ, ఆధార్ ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు పాస్పోర్జు సైజు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు మే నెలలో జరగబోయే అంతర జిల్లాల పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. వివరాలకు 94411 71933, 77804 84313 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పెనుగొండ: సంచలనం సృష్టించిన కోడేరు ఉత్తరం పాలెంలోని కోడి పందేల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11వ తేదీన కోడి పందేల స్థావరంపై దాడి చేసి 42 మందిని అరెస్ట్చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. కాగా, కోడి పందేల్లో కీలకంగా వ్యవహరించిన ఉత్తర పాలెంకు చెందిన ఓ వ్యక్తిని, పోడూరు మండలం కవిటంకు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి పాలకొల్లు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై కట్టా వెంకట రమణ తెలిపారు.
ముదినేపల్లి(కై కలూరు): గురజ గ్రామంలో సోమవారం ఓ పాన్ షాప్ వద్ద క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న 8 మందిని ఆదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4,500 నగదు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీరభద్రరావు చెప్పారు. క్రికెట్ బెట్టింగులు నిర్వహించడం నేరమని, చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.


